Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనాపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక
జెనీవా : ప్రస్తుతం ప్రపంచంలో ప్రత్యేకించి ఉత్తరార్ధ గోళంలో కరోనా మరింతగా విజృంభించే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనామ్ గెబ్రెయస్ శుక్రవారం హెచ్చరించారు. 'ముందున్నది చాలా గడ్డు కాలం, కొన్ని దేశాలు ఇప్పటికే ప్రమాదకరమైన దశలో ఉన్నాయి' అని ఆయన వివరించారు. కొన్ని దేశాల్లో కరోనా కేసులు అసాధారణ రీతిలో పెరుగుతున్నాయన్నారు. ఆస్పత్రులు, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు
కిక్కిరిసి పోతున్నాయి. అత్యవసరమైన ఆరోగ్య సేవలు కుప్పకూలకుండా చూడాలన్నారు. కరోనా మరణాలను అరికట్టాలని ఆయన సూచించారు. పాఠశాలలు ఇంకా మూసివేయాల్సిన పరిస్థితి రాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ప్రపంచ నేతలకు విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరిలో ఇదే చెప్పామని, ఇప్పుడు కూడా దీన్నే పునరుద్ఘాటిస్తున్నామని ఆయన అన్నారు. కరోనా నియంత్రణ కోసం అమలు చేస్తున్న చర్యలకు అందరూ మద్దతివ్వాలని ఆయన ప్రజలను కోరారు. ఏ దేశమూ ప్రమాదం నుండి బయటపడలేదని, తొలి దశలో కొద్దిగానే కేసులు నమోదైన దేశాలు కూడా ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని డబ్ల్యుహెచ్ఓ హెల్త్ ఎమర్జన్సీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ రియాన్ చెప్పారు.