Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాక్ ఆర్మీ, ఐఎస్ఐపై నవాజ్ షరీఫ్ ధ్వజం
- క్వెట్టాలో 11 పార్టీలతో కూడిన ప్రతిపక్ష కూటమి ర్యాలీ
కరాచి : పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న రాజకీయ దుస్థితికి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా, ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్లే కారణమని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు మూడవసారి ఉమ్మడి ర్యాలీ నిర్వహించాయి. ఇమ్రాన్ఖాన్ను అధికారం నుండి దించడానికే 11 ప్రతిపక్ష పార్టీలు కలిసి పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ (పిడిఎం)గా గత నెల 20న ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నెలలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెండుసార్లు పిడిఎం భారీ ర్యాలీ నిర్వహించింది. లండన్ నుండి వీడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ, ఈ పరిస్థితులకు ఆర్మీ చీఫ్, ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ కారణమని విమర్శించారు. 2018 ఎన్నికల్లో రికార్డు స్థాయిలో రిగ్గింగ్ జరగడానికి, పార్లమెంట్లో బేరసారాలకు, రాజ్యాంగ నిబంధనలను తోసిరాజని, ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఇమ్రాన్ను ప్రధానిగా చేయడానికి మీరు సమాధానం చెప్పాల్సి వుంటుందని జనరల్ బజ్వాను ఉద్దేశించి నవాజ్ పేర్కొన్నారు. అనేక సంవత్సరాలుగా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటూ శిక్ష మినహాయింపు నిబంధనలతో తప్పించుకుంటున్నారని ఐఎస్ఐ చీఫ్ జనరల్ హమీద్ను తీవ్రంగా విమర్శించారు. అయితే రాజకీయాల్లో జోక్యం చేసుకున్నమన్న ఆరోపణలను పాక్ ఆర్మీ తోసిపుచ్చుతోంది. తాను ఎన్నికల్లో గెలుపొందడానికి ఆర్మీ సాయం చేసిందనడాన్ని ప్రధాని ఇమ్రాన్ కూడా తిరస్కరిసుఎ్తన్నారు. బెలూచిస్తాన్ ప్రావిన్స్లో వందలాదిమంది అదృశ్యమవుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ, బాధితులను చూస్తుంటే ఆవేదన కలుగుతోందని అన్నారు. కాగా పిఎంఎల్-ఎన్ అధ్యక్షురాలు, షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ ర్యాలీలో మాట్లాడుతూ, పాకిస్తాన్ భవితవ్యాన్ని మార్చాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఇక ఎన్నాళ్ళో ఈ అదృశ్యం కేసులు వుండబోవని అన్నారు.
పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిల్వాల్ భుట్టో మాట్లాడుతూ, ఈ ప్రజాస్వామ్యంలో మీడియాకు, జ్యుడీషియరీకి కూడా స్వేచ్ఛ లేదని విమర్శించారు. వ్యక్తుల అదృశ్యంపై బెలూచిస్తాన్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సర్దార్ అక్తర్ మెంగల్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇదిలావుండగా, ఆదివారం నాటి ర్యాలీలో పాల్గొనేందుకు క్వెట్టా వచ్చిన మోషిన్ దర్వార్ను భద్రతా అధికారులు అరెస్టు చేశారు. ఈ రాష్ట్రంలో దర్వార్ ప్రవేశంపై నిషేధం వుందన అందుకే అరెస్టు చేశామని హౌం మంత్రి జియాఉల్లా లాంగొవె చెప్పారు.