Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్ సంక్షోభం నుంచి.. లక్ష్యం దిశగా..
- అనూహ్యంగా పెరిగిన ప్రజల కొనుగోలు శక్తి
- తాజాగా 4.9శాతం జీడీపీ వృద్ధి నమోదు
- కరోనా రెండో తాకిడిని కూడా నియంత్రించిదన్న అంతర్జాతీయ సంస్థలు
బీజింగ్ : కోవిడ్-19 సృష్టించిన సంక్షోభం నుంచి చైనా క్రమంగా బయటపడుతోంది. అక్కడి ప్రజల కొనుగోలు శక్తి అనూహ్యంగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తాజా గణాంకాల (జులై, ఆగస్టు, సెప్టెంబరు) ప్రకారం, చైనా జీడీపీ 4.9శాతం వృద్ధి నమోదుచేసింది. దీని ప్రకారం, కరోనా మహమ్మారికి ముందునాటి పరిస్థితులు చైనాలో త్వరలో ఏర్పడతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడే దిశగా చైనా అడుగులు వేస్తున్నదని, కరోనా వైరస్ రెండో తాకిడిని కూడా చైనా నియంత్రించిందని అంతర్జాతీయ సంస్థలు వెల్లడించాయి. వైరస్ ప్రభావం చైనా ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడిందని, అయితే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా పుంజుకుందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ (రిజర్వ్ బ్యాంక్) కూడా ఇటీవల తన నివేదికలో పేర్కొంది. కరోనా మహమ్మారి కారణంగా 1976 ఏడాది తర్వాత చైనా జీడీపీ గణాంకాలు కనిష్టస్థాయికి పడిపోయాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా తిరిగి మళ్లీ పుంజుకోవడానికి ఎంతోకాలం పట్టలేదు. ఏప్రిల్-జూన్లో మెల్లగా వృద్ధి దిశగా అడుగులేయటం మొదలైంది. 2019 రెండో త్రైమాసికంతో పోల్చితే, ఏప్రిల్-జూన్లో జీడీపీ వృద్ధి 3.2శాతం నమోదైంది. స్థిరమైన రికవరీ దిశగా చైనా అడుగులేయటం మిగిలిన దేశాల్లో సైతం ఆశావహ దృక్పథాన్ని నింపింది. ప్రజల కొనుగోలు, వినిమయం స్థిరంగా, సమతుల్యంతో ఉండటం మెరుగైన గణాంకాలు రావడానికి కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. చైనాలోని ప్రధాన నగరాల్లో ప్రజల రోజువారీ కార్యక్రమాలు సాధారణ స్థితికి వచ్చినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు నాటికి పాఠశాలలు, కార్యాలయాలు పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాయి.
చైనా పాలకులు ప్రత్యేక సమావేశం నిర్వహించి 14వ పంచవర్ష ప్రణాళికను రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్వయం సంవృద్ధి దశకు చేరుకోవాలని అమెరికా, ఇతర దేశాల మీద ఆధారపడటం తగ్గించుకోవాలని, విజన్ 2025లో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రస్తుతం కరోనా కట్టడిలో ఉన్నది కావున చైనా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి అనుకూల పరిస్థితిలో ఉన్నదని ఆర్థిక వేత్తలు తెలిపారు. ఇదే సమయంలో అమెరికా తన ఆర్థిక వ్యవస్థను మరమ్మతు చేసుకునే స్థితిలోనే కూరుకుపోయి ఉండటం గమనార్హం.
దశలవారీగా..లక్ష్యాన్ని నిర్దేశించుకొని..
- పారిశ్రామిక ఉత్పత్తి సెప్టెంబరునాటికి 6.9శాతం పెరిగింది. రిటైల్రంగంలో అమ్మకాలు 3.3శాతం పెరిగాయి.
- గత ఏడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది సెప్టెంబరునాటికి ఆటో సేల్స్ 12.8శాతం పెరిగాయి. పర్యాటకం, దేశీయ విమాన రాకపోకలు పుంజుకున్నాయి.
- కరోనా ముందునాటి పరిస్థితులు దేశంలో తీసుకురావాలని అక్కడి పాలకులు తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి అనూహ్యంగా పెరిగింది.
- కరోనా సంక్షోభం నుంచి బయటపడటానికి దశల వారీగా లక్ష్యాల్ని నిర్దేశించుకొని అమలుచేస్తున్న విధానాలు, ప్రపంచంలో ఇతర దేశాలు సైతం అనుసరిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.
- పారిశ్రామికోత్పత్తి పెరగటమేకాదు, వివిధరంగాల్లో ప్రభుత్వ ప్రాజెక్టుల పనులు వేగాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా నిర్మాణరంగంలో కొత్త పెట్టుబడులు వస్తున్నాయి.