Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాక్రాన్ వైఖరిని ఖండించిన ముస్లిం ప్రపంచం
- ఫ్రెంచి మ్యాగజైన్ కార్టూన్పై టర్కీ నేత ఆగ్రహం
అంకారా : తన విద్యార్ధులకు మహ్మద్ ప్రవక్త కేరికేచర్లను చూపించినందుకు గానూ అక్టోబరు 16న పట్టపగలే ఫ్రెంచి టీచర్ శామ్యూల్ పాటీని ఆయన స్కూలు సమీపంలోనే హత్య చేసిన అనంతరం ఉద్రిక్తతలు పెచ్చరిల్లాయి. ఆ సంఘటన జరిగిన తర్వాత నుండి ఆ హత్య ను ఇస్లాంకు ముడిపెడుతూ ఫ్రాన్స్ అధికారులు వ్యాఖ్యలు చేస్తున్నారు. కాగా, ఈ నెల ప్రారంభంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ మాట్లాడుతూ, ఇస్లాంను సంక్షోభంలో వున్న మతంగా అభివర్ణించారు. ఈ రెండు సంఘటనల అనంతరం ముస్లిం దేశాలకు, ఫ్రాన్స్కు మధ్య విబేధాలు పెరిగాయి. ఇస్లాం పట్ల ఆయనకున్న వైఖరికి గానూ ముందుగా మానసిక పరీక్షలు చేయించుకోవడం మంచిదని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తైయీప్ ఎర్డోగన్, ఫ్రాన్స్ నేతను విమర్శించారు. ఫ్రాన్స్ వైఖరిని ముస్లిం ప్రపంచమంతా తీవ్రంగా ఖండించింది. పలు నగరాల్లో వేలాదిమంది నిరసనలు చేపట్టారు. ఫ్రాన్స్ ఉత్పత్తులను బహిష్కరించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఇస్లాంపై తీవ్రంగా దాడి చేస్తున్నారంటూ ఎర్డోగన్ ఫ్రాన్స్ తదితర దేశాలను ఆరోపించారు. ఇప్పుడు కేరికేచర్లతో వ్యక్తిగతంగా కూడా వారు నాపై దాడులు చేస్తున్నారు, ఇన్నేళ్ళ తర్వాత ఇస్లాంపై మళ్లీ దాడి చేయాలని వారు భావిస్తున్నారని అన్నారు. ''మా మతమే కాకుండా ఎదుటివారి మతాలను, వారి విలువలను గౌరవించే దేశం మాది. ఆ విలువలనే వారు లక్ష్యాలుగా మార్చుకున్నారు.' అని ఆయన వ్యాఖ్యానించారు. టర్కీ అధ్యక్షుడిని అవమానపరిచిందుకు ఫ్రాన్స్ మ్యాగజైన్ చార్లి హెబ్డో టర్కీలో దర్యాప్తును ఎదుర్కొననుందని అంకారాలో ప్రాసిక్యూటర్లు ప్రకటించారు. మహ్మద్ ప్రవక్తను అవమానించడం వల్ల హింసను ప్రోత్సహించినట్లవుతుందని ఇరాన్ అధ్యక్షుడు రౌహని బుధవారం హెచ్చరించారు. ప్రవక్తను అవమానించడం పెద్ద విజయమేమీ కాదు, అనైతికం కూడానని ఆయన వ్యాఖ్యానించారు. కాగా సంయమనం, భావ స్వేచ్ఛ వంటి విలులను పరిరక్షించేందుకు బాసటగా నిలబడాల్సిందిగా బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి డొమినిక్ రాబ్ నాటో మిత్రపక్షాలను కోరారు.