Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిన్పింగ్ వెల్లడి
బీజింగ్ : ప్రపంచంలో చాలా దేశాలు ఆర్థిక మాంద్యం, కరోనా సంక్షోభం మధ్య కొట్టుమిట్టాడుతుండగా, దీనికి భిన్నంగా చైనా కరోనాను జయించి, ఆర్థికంగా పురోగమిస్తోంది. మరోవైపు చైనాను దెబ్బతీసేందుకు అమెరికా పన్నిన కొత్త ప్రచ్ఛన్న యుద్ధపు ఎత్తుగడలను దీటుగా ఎదుర్కొనేందుకు కొత్త వ్యూహం రూపొందించింది. ప్రపంచంపై వీలైనంత తక్కువగా ఆధారపడుతూ, చైనాపై ప్రపంచం మరింతగా ఆధారపడేలా చేయడమే ఆ వ్యూహం. అధ్యక్షుడు సీ జిన్పింగ్ చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక తాజా సంచికకు రాసిన వ్యాసంలో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ దేశాలపై అతి తక్కువగా ఆధారపడుతూ, చైనాపై ప్రపంచ దేశాలు మరింతగా ఆధారపడేలా చేయాలన్నది ప్రస్తుతం చైనా లక్ష్యంగా వుందన్నారు. ఈ ఘర్షణలో నిర్ణయాత్మకంగా వుండగలిగే ''ట్రంప్ కార్డ్'' సాంకేతికతలను జిన్పింగ్ చర్చించారు. అధ్యక్షుడు ప్రకటించిన ఈ వైఖరికి 'డ్యూయల్ సర్క్యులేషన్' అని పేరు పెట్టారు. ముందుగా దేశీయ ఆర్థిక వ్యవస్థ(అంతర్గత పంపిణీ)కి ఊతమివ్వడం, రెండోది చైనా విదేశీ సంబంధాలను పునర్నిర్వచించడం (రెండో పంపిణీ లేదా సర్క్యులేషన్).ఏప్రిల్లో అధ్యక్షుడు జిన్పింగ్ అంతర్గతంగా చేసిన ప్రసంగం ఆధారంగా కొత్తగా ఈ వ్యాసాన్ని నవంబరులో ప్రచురితం చేశారు. దేశీయంగా డిమాండ్ను విస్తరించడమనేది చైనా ప్రాధాన్యతగా వుండాలన్నది వ్యూహమని జిన్పింగ్ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో అంతర్గత డిమాండ్ వ్యవస్థను నిర్మించడం చైనా దీర్ఘకాల అభివృద్దిపై, దీర్ఘకాల శాంతి సుస్థిరతలపై ప్రభావం చూపిస్తుందని అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఆర్థిక గ్లోబలైజేషన్ క్రమాన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే ఈ కరోనా మహమ్మారితో ప్రతికూల గ్లోబలైజేషన్ ధోరణులు పెరుగుతున్నాయని అన్నారు. కరోనా ప్రభావాన్ని ఎదుర్కొనాలంటే అంతర్గత డిమాండ్ విస్తరణ వ్యూహం అమలు ఒక్కటే మార్గమని స్పష్టం చేశారు. ఇక ఈ వ్యూహంలో రెండో స్తంభం వంటిది, ఉత్పత్తి క్రమాలను, సరఫరా క్రమాలను గరిష్టంగా స్థిరీకరించడమని చెప్పారు. చైనా పారిశ్రామిక భద్రత, జాతీయ భద్రతను పరిరక్షించేందుకు స్వతంత్రంగా నియంత్రించగలిగే పరిస్థితిలో వుండేలా, భద్రంగా, స్వావలంబనతో వుండేలా ఉత్పత్తి, సరఫరా క్రమాల నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించడమేనని అన్నారు.