Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్లకార్డులతో పర్యావరణవేత్తల ఆందోళన
- ఆస్ట్రేలియా.. ఇండియా మ్యాచ్ మధ్యలో నిరసన
సిడ్ని : ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో... ఏడో ఓవర్ బౌలింగ్ వేయటానికి నవదీప్ సైనీ సిద్ధమయ్యాడు. ఇద్దరు వ్యక్తులు ఫ్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ గ్రౌండ్లోకి ఎంటరయ్యారు. అదానీకి ఎస్బీఐ మిలియన్ డాలర్ల రుణాన్ని ఇవ్వొద్దని ఆ ఫ్లకార్డులపై రాసి ఉన్నది. సెక్యూరిటీ సిబ్బంది తేరుకునేలోపే వారు పిచ్వద్దకు చేరుకున్నారు. వారి టీషర్టుల మీద స్టాప్ అదానీ అని స్టిక్కర్లు ఉన్నాయి. గుజరాత్కు చెందిన కార్పొరేట్ దిగ్గజం గౌతమ్ అదానీ ప్రధాని మోడీకి అతి సన్నిహితుడు. దేశంలోనే కాదు విదేశాల్లోనూ అదానీ దందా కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాలో ఉన్న బొగ్గుగనులకు వ్యతిరేకంగా అక్కడ భారీ నిరసనలు కొనసాగిన విషయం విదితమే. కాగా ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని కోల్మైన్కు 5వేల కోట్ల రుణం ఇచ్చేందుకు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అంగీకరించింది. దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం క్రికెట్ మైదానం వెలుపల పర్యావరణ వేత్తలు బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. అదానీ మైనింగ్ వల్ల పర్యావరణానికి ముప్పు కలుగుతున్నదని ఆ ప్రదర్శనలో నినాదాలు చేశారు. ఈ ప్రదర్శన కొనసాగుతుండగా..మరోవైపు ఇద్దరు నిరసకారులు పిచ్ వద్దకు వచ్చి మరీ ప్లకార్డులు ప్రదర్శించటం గమనార్హం. అయితే 2014లో ఒక బిలియన్ డాలర్ల రుణం అదానీకి ఇవ్వటానికి ఎస్బీఐ ఒప్పుకున్నది. అయితే దీనికి వ్యతిరేకంగా నిరసలతో ఎస్బీఐ వెనక్కి తగ్గింది. ప్రతిపక్షపార్టీలు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన విదితమే. ఐదు పెద్ద బ్యాంకులు (సిటీబ్యాంక్, రాయల్ డైచే, బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్,హెచ్ఎస్బీసీ,బార్క్లే) అదానీకి రుణాన్ని తిరస్కరించాయి. తాజాగా పర్యావరణానికి తీవ్రంగా విఘాతం కలిగిస్తున్న ఆయనకు ఎస్బీఐ రుణం ఇవ్వకూడదని క్రికెట్ స్టేడియంలో పిచ్ వద్ద ఆ యువకులు నిరసన ప్రదర్శన చేశారు.