Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫ్రాన్స్లో ప్రదర్శనలు
- నల్ల జాతీయుడిపై పోలీసుల దాడి
పారిస్ : వివాదాస్పదమైన కొత్త భద్రతా బిల్లును ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది ప్రజలు శనివారం ఫ్రాన్స్వ్యాప్తంగా వీధుల్లోకొచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. కాగా, మరోవైపు పోలీసు అధికారులు నల్లజాతీయుడిని జాతి, రంగు పేరుతో దుర్భాషలాడుతూ చావబాదడంతో ముదిరిన వివాదం దేశాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. తప్పు చేసిన పోలీసు అధికారుల ముఖాలు ప్రసారం చేసేందుకు మీడియాకు గల హక్కును నియంత్రిస్తున్న ఈ కొత్త భద్రతా చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. గత వారాంతంలో పారిస్లో నల్ల జాతీయుడైన సంగీత దర్శకుడు మైఖేల్ జెక్లర్ను చితకబాదుతున్న ఫోటోలు సిగ్గు చేటని శుక్రవారం అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్ వ్యాఖ్యానించారు. పోలీసు బలగాల్లో వ్యవస్థాగతంగా పాతుకుపోయిన వర్ణ వివక్షను తెలియచెప్పేలా ఈ సంఘటన వుంది. 'పోలీసులు ప్రతి చోటా వుంటున్నారు. కానీ న్యాయం ఎక్కడా లేదు.' 'పోలీసు రాజ్యం', మీపై చేయి చేసుకుంటుంటే చిరునవ్వు నవ్వండి' అంటూ ఆందోళనకారులు ఇస్తున్న నినాదాలతో పారిస్లోని ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. నిర్వాహకులు ప్రదర్శనను ఒక చోటకే పరిమితం చేయాలని తొలుత అధికారులు డిమాండ్ చేశారు. కానీ చివరకు వేరే చోటకు ప్రదర్శన సాగడానికి అనుమతించారు. కాగా నల్ల జాతీయుడిపై దాడికి సంబంధించిన కేసులో నలుగురు పోలీసులపై దర్యాప్తు ఆరంభమైంది. అయితే ఈ కొత్త భద్రతా బిల్లు చట్టంగా మారితే దాడి చేసిన ఆ పోలీసు అధికారుల ముఖాలు మరెన్నడూ బహిర్గతం కావని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుకు సెనెట్ ఆమోద ముద్ర రావాల్సి వున్నప్పటికీ నేషనల్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ చట్ట నిబంధనల ప్రకారం నేరం చేసిన వారు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వుంటుంది. 45వేల యూరోల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి వుంటుంది.