Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30మంది భద్రతా సిబ్బంది మృతి
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ప్రావిన్స్లోని ఘజ్నిలో ఆదివారం జరిగిన కారు బాంబు దాడిలో 30మంది ఆఫ్ఘన్ భద్రతా సిబ్బంది మరణించారని అధికారులు తెలిపారు. పేలుడు జరిగిన తీరు, దాని తీవ్రత చూస్తుంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని భావిస్తున్నారు. ఇప్పటికి 30మృత దేహాలు ఆస్పత్రికి చేరాయని, గాయపడిన 24మందిని తీసుకువచ్చినట్టు ఘజ్ని ప్రావిన్షియల్ ఆస్పత్రి డైరెక్టర్ మహ్మద్ హెమత్ తెలిపారు. బాధితులందరూ భద్రతా సిబ్బందేనని చెప్పారు. ఆఫ్ఘన్ భద్రతా బలగాల్లో ఒక విభాగమైన ప్రజా రక్షణ బలగాల కాంపౌండ్ను లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. కాంపౌండ్ చుట్టూగల పౌర నివాసాలన్నీ ఈ పేలుడు ధాటికి ధ్వంసమయ్యాయి. అక్కడ కూడా కొంతమంది మరణించి వుండవచ్చని భావిస్తున్నారు. హౌం మంత్రిత్వ శాఖ ప్రతినిధి తారిక్ అరియాన్ పేలుడును ధ్రువీకరించారు. కానీ ఇతర సమాచారమేదీ అందించలేదు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు. తాలిబన్ ప్రతినిధి ముజాహిద్ను దీనిపై ప్రశ్నించగా, తమదే బాధ్యత అని ధృవీకరించలేదు, కాదని నిరాకరించలేదు. గత కొద్ది మాసాలుగా ఆఫ్ఘనిస్తాన్లో కారు బాంబు దాడులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. శాంతి చర్చలు సాగుతున్నా దానితో నిమిత్తం లేకుండా హింస కొనసాగుతునే వుంది. ఆదివారమే జరిగిన మరో బాంబు దాడిలో ఒకవ్యక్తి మరణించగా, 23మంది గాయపడ్డారని జబూల్ ప్రావిన్స్ గవర్నర్ తెలిపారు. ఈ దాడికి కూడా ఎవరూ బాధ్యత తమదేనని ప్రకటించలేదు.