Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన గవర్నర్లు
వాషింగ్టన్ : అరిజోనా, విస్కాన్సిన్ రాష్రాల్లో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి జో బైడెనే విజేత అని సోమవారం ఆయా రెండు కీలక రాష్ట్రాలు అధికారికంగా ప్రకటించాయి. విస్కాన్సిన్లో బైడెన్ 20,700 ఓట్లను గెలుచుకున్నారు. కానీ ట్రంప్ అక్కడ ఎన్నికల ఫలితాన్ని అంగీకరించడానికి ఇప్పటివరకు తిరస్కరిస్తూ వచ్చారు. విస్కాన్సిన్ గవర్నర్ టోనీ ఎవర్స్ ఎన్నికల ఫలితాన్ని ప్రకటిస్తూ.. ''నవంబరు 3న జరిగిన అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని ధృవీకరించడం ద్వారా నా విధి నిర్వర్తించాను'' అని పేర్కొంటూ తన సంతకంతో కూడిన సర్టిఫికెట్ను అందచేశారు. ట్రంప్ అభ్యర్ధించినట్లుగా రెండు కౌంటీల్లోని ఓట్లను తిరిగి లెక్కించడం పూర్తి చేసిన మరుసటిరోజు ఈ ప్రకటన వెలువడింది.
అంతకుముందే సాంప్రదాయబద్ధంగా రిపబ్లికన్లకు కంచుకోటగా నిలుస్తూ వచ్చిన అరిజోనాలో కూడా 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో బైడెన్ గెలుపొందారంటూ సర్టిఫికెట్ అందచేసింది. ఈ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వంతో నిర్వహించామని, అరిజోనా చట్టాలకు అనుగుణంగానే ప్రతిచోటా వ్యవహరించామని గవర్నర్ డౌ హౌబ్స్ చెప్పారు. ఎలక్టోరల్ కాలేజీలో అరిజోనాకు 11మంది సభ్యులు వున్నారు. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో బైడెన్కు 306ఓట్లు రాగా, ట్రంప్నకు 232 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాన్ని చట్టసభల సభ్యులందరూ తిరస్కరించాలంటూ ట్రంప్ వ్యక్తిగత అటార్నీ రూడీ గిలియానీ విజ్ఞప్తి చేసిన సమయంలోనే అరిజోనా ప్రకటన వెలువడింది. ఎన్నికల ఫలితాల ధ్రువీకరణను సవాలు చేయడానికి ట్రంప్కు ఐదు రోజుల గడువుంది.