Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శాశ్వతంగా నిషేధిస్తున్నామని ట్విట్టర్ ప్రకటన
- సందేశాలతో మరింత హింసను ప్రోత్సహించే ప్రమాదముందన్న ట్విట్టర్
- ఒక వర్గం ప్రజల్ని రెచ్చగొట్టినందుకే..
- జో బైడెన్ ప్రమాణ స్వీకారం రోజున అల్లర్లకు ప్రణాళిక !
- ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం ఖాతాలు సస్పెండ్ : జుకర్బర్గ్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నామని సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రోజుల క్రితం క్యాపిటల్ బిల్డింగ్పై జరిగిన హింసాత్మక దాడులను ప్రోత్సహించే విధంగా ఇటీవల ట్రంప్ చేసిన ట్వీట్స్ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ వివరణ ఇచ్చింది. దీనికితోడు మరోసారి హింసాత్మక అల్లర్లకు మద్దతిచ్చే అవకాశముందని ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ తెలియజేసింది. అంతేగాక..కొత్త అధ్యక్షుడుగా ఎంపికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారం రోజున సామాజిక మాధ్యమం ద్వారా నిరసనలను ప్రోత్సహించే ప్రమాదముందని తాజా నిర్ణయం తీసుకున్నట్టు సుదీర్ఘ వివరణ ఇచ్చింది.
క్యాపిటల్ భవనంపై దాడి తర్వాత ట్రంప్ ఖాతాలను 12 గంటలపాటు స్తంభింపజేస్తున్నట్టు ట్విట్టర్, ఫేస్బుక్ తొలుత ప్రకటించాయి. జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే రోజువరకూ ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలను నిలిపివేస్తున్నామని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ చెప్పారు. అయితే ట్విట్టర్ తాజా ప్రకటన నేపథ్యంలో, ఫేస్బుక్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తన వ్యక్తిగత ఖాతాను నిషేధించటంతో, ట్రంప్ 'ప్రెసిడెంట్ ట్రంప్' ఖాతాలో సందేశాలు పోస్ట్ చేశారు. ఈ పోస్టులను ట్విటర్ తొలగించటంతో, 'టీమ్ ట్రంప్' ఖాతాను ఉపయోగించారు. తిరిగి అవే వ్యాఖ్యల్ని ఈ ఖాతాలో ట్రంప్ పోస్ట్ చేశారు. దాంతో 'టీమ్ ట్రంప్' ఖాతాను కూడా ట్విట్టర్ నిషేధించింది.
ప్రపంచ నేతలకు మినహాయింపు !
ట్రంప్ ట్విట్టర్ ఖాతాకు 8.87కోట్లమంది, ఫేస్బుక్ ఖాతాకు 3.52కోట్లమంది, ఇన్స్టాగ్రామ్లో 2.45కోట్లమంది ఫాలోవర్లున్నారు. చాలాకాలంగా ట్రంప్సహా వివిధ ప్రపంచ నేతలకు నిబంధనలలో కొంతమేర మినహాయింపులను అమలుచేస్తున్నట్టు ట్విట్టర్ ఈ సందర్భంగా వెల్లడించింది. వ్యక్తిగత దూషణలు, విద్వేష ప్రసంగాలు తదితర విషయాలలో ప్రపంచ నేతలకు నిబంధనల నుంచి మినహాయింపులు ఇస్తున్నామని తెలియజేసింది.
ట్విట్టర్ చాలా ఆలస్యం చేసింది : రాజకీయ విశ్లేషకులు
క్యాపిటల్ బిల్డింగ్ వద్ద బుధవారం జరిగిన హింసాత్మక ఘటనల తదుపరి సామాజిక మాధ్య మాల తీరు విమర్శలపాలైంది. ముఖ్యంగా ట్విట్టర్ 'పౌర నైతిక విధానా'న్ని అధ్యక్షుడు ట్రంప్ పదే పదే ఉల్లంఘించినా చర్యలు తీసుకోకపోవటాన్ని రాజ కీయ విశ్లేషకులు తప్పుబట్టారు. తన మద్దతుదారుల్ని ఉసిగొల్పుతూ ట్రంప్ ప్రసంగించిన వీడియోను యూట్యూబ్, ఫేస్బుక్ తొలగించాయి. అయితే ట్రంప్ మాట్లాడిన మాటలు ప్రపంచానికి చేరిపో యాయి. సోషల్ మీడియా కంపెనీలు చెబుతున్న నిబంధనలు గోడమీద రాతలుగా మారాయని కొంతమంది విమర్శిస్తున్నారు. ట్విట్టర్, ఫేస్బుక్.. తమ సొంత లాభాలు చూసుకుంటున్నాయని, షేర్ హోల్డర్లకు లాభాలు రావటంపైనే దృష్టి సారించాయి తప్ప, 'నైతిక విధానాల'ను పకడ్బంధీగా అమలుజేయటం లేదని ఆరోపణలున్నాయి.
అన్ని వైపుల నుంచి ఒత్తిడి వచ్చాకే..
ఓవైపు ఫేస్బుక్ తాత్కాలికంగా డొనాల్డ్ ట్రంప్ ఖాతాను ఈనెల 20వరకు నిలిపివేయగా, ట్విట్టర్ తొలుత 12గంటలపాటు ట్రంప్ ఖాతాను (క్యాపిటల్ బిల్డింగ్ దాడి జరిగాక) స్తంభింపజేసింది. హింసాత్మక ఘటనల అనంతరం వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో సామాజిక మాధ్యమాలు ట్రంప్ ఖాతాను సస్పెండ్ చేయక తప్పలేదు. ట్రంప్ ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా నిషేధించగా, ఫేస్బుక్ సైతం అదే బాటలో నడిచే వీలున్నదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్నకు మద్దతిచ్చే మాజీ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్, అటార్నీ సిడ్నీ పోవెల్ ఖాతాలనూ శాశ్వతంగా నిషేధించినట్టు ట్విట్టర్ తాజాగా వెల్లడించింది.