Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈయూకి చెందిన 'కోపర్నికస్ ఎర్త్ అబ్జర్వేషన్ సర్వీస్' వెల్లడి
బ్రస్సెల్స్/లండన్ : 2016తో పోల్చుకుంటే 2020 సంవత్సరంలో ప్రపంచ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరాయని యూరోపియన్ శాస్త్రవేత్తలు తాజాగా వెల్లడించారు. మొత్తంగా ఇటీవలి కాలంలో వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రతరం కావడంతో 2010-20 అత్యంత వేడి దశాబ్ధంగా నిలిచిందని ఈయూకి చెందిన కోపర్నికస్ ఎర్త్ అబ్జర్వేషన్ సర్వీస్ తెలిపింది. 2020లో ఉష్ణోగ్రతలు పారిశామ్రికీకరణ ముందు సమయంతో పోల్చుకుంటే సరాసరిన 1.25 సెంటీగ్రేడ్ అధికంగా ఉందని పేర్కొంది. ఈ అధిక స్థాయి ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాల్లో విపరీత విపత్తులకు దారి తీశాయి. అమెరికాలో 22 వేర్వేరు విపత్తులు చోటుచేసుకోగా, ప్రతి ఘటనలో 100 కోట్ల డాలర్ల మేర నష్టం వాటిలింది. ఈ విపత్తుల్లో అటవీ కార్చిచ్చులు, హరికేన్లు వంటి ఘటనలు ఉన్నాయని అమెరికా ప్రభుత్వ ఇటీవలి నివేదిక పేర్కొంది.
అదేవిధంగా యూరప్ దేశాల్లో కూడా ఈ వాతావరణ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపించింది. 2020లో అధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై రికార్డు సంవత్సరంగా నిలిచింది. ఆర్కిటిక్, ఉత్తర సిబేరియా ప్రాంతాలు వేడిగాలులు, మంటలను ఎదుర్కొన్నాయని కోపర్నికస్ పేర్కొంది. వాతావరణ మార్పులపై చర్చించేందుకు ఈ ఏడాది నవంబర్లో స్కాట్లాండ్లోని గ్లాస్గోలో వాతావరణ సదస్సులో అన్ని దేశాల ప్రభుత్వాలు పాల్గొననున్న నేపథ్యంలో.. 2015 పారిస్ ఒప్పందానికి అనుగుణంగా ఉద్గార వాయువుల విడుదలను తగ్గించేందుకు వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలు నొక్కిచెబుతున్నాయని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి సంవత్సరం మనం విడుదల చేసే ఉద్గారాలను తగ్గించుకుంటూ రావడం చాలా ముఖ్యమనికోపర్నికస్ ఎర్త్ అబ్జర్వేషన్ సర్వీస్కు చెందిన సీనియర్ శాస్త్రవేత్త ఫ్రేజా వాంబోర్గ్ అన్నారు. వాతావరణ మార్పుల అత్యంత వినాశకర ప్రభావాలను నివారించేందుకు ఉష్ణోగ్రతల పెరుగుదలను 2 సెంటీగ్రేడ్ల కంటే తక్కువగా, 1.5 సెంటీగ్రేడ్కి దగ్గరిగా తటస్థీకరించడం పారిస్ ఒప్పంద లక్ష్యంగా ఉన్నది.