Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేద దేశాలకు టీకాలు లభించేందుకు అంతర్జాతీయ సమాజం కృషి అవసరం :
డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: కోవిడ్-19 నియంత్రించడానికి అనేక దేశాలు టీకాలు వేసే కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ.. ఈ ఏడాదిలో హెర్డ్ ఇమ్యూనిటీ (మంద రోగ నిరోధక శక్తి) సాధించడం అసాధ్యమనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) పేర్కొంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి తగినన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి రావడానికి మరింత సమయం పడుతుందని డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామి నాథన్ అన్నారు. పలు దేశాల్లో కరోనా టీకా పంపిణీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కరోనాను అదుపు చేయడానికి టీకాతో పాటు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, సానిటైజర్లు వాడటం అత్యంత ఆవశ్యకమని తెలిపారు. అలాగే, ఈ నెల చివర్లోనే ప్రపంచంలోని పేద దేశాల్లోనూ కరోనా టీకా పంపిణీ ప్రారంభమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందేలా ప్రపంచ సమాజం కృషి చేయాలని సూచించారు. ఇటీవల బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, ఇజ్రాయిల్, నెదర్లాండ్స్ తదితర దేశాలు కరోనా వైరస్కు వ్యతిరేకంగా లక్షలాది మంది తమ పౌరులకు టీకాలు అందించాయి. అయితే వ్యాక్సిన్లు అత్యంత దుర్బలమైన రక్షణను కల్పించినప్పటికీ.. 2021లో హెర్డ్ ఇమ్యూనిటీని సాధించలేము అని స్వామినాథన్ చెప్పారు.
కాగా, హెర్డ్ ఇమ్యూనిటీ సాధించడానికి సుమారు 70 శాతం వ్యాక్సినేషన్ రేటు అవసరమవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. డబ్ల్యూ హెచ్వో డైరెక్టర్ జనరల్ సలహాదారు బ్రూస్ ఐల్వార్డ్ మాట్లాడుతూ.. ఈనెలలో లేదా ఫిబ్రవరిలో ప్రపంచంలోని పేద దేశాల లో కరోనా వైరస్ టీకాలు ప్రారంభమవుతాయని డబ్ల్యూహెచ్వో భావిస్తోందనీ, అన్ని దేశాలకు టీకా అందేలా ప్రపంచ సమాజం మరింత కృషి చేయా లని పేర్కొన్నారు. తాము స్వంతంగా చేయలేమనీ, టీకా తయరీదారుల సహాకారం డబ్ల్యూహెచ్వోకు అవసరమని ఆయన తెలిపారు.