Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 35 మంది మృతి..
- శిధిలాల కింద మరికొందరు..
- రిక్టర్ స్కేల్పై 6.2 తీవ్రత నమోదు
జకార్తా: ఇండోనేషియాలోని సులవేసి దీవిలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం 35 మందిని మింగేసింది. శిధిలాల కిందట అనేకమంది చిక్కుకున్నారు. వారిని రక్షించటానికి సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. స్థానిక కాలమానం ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత భూకంపం సంభవించింది. 6.2 తీవ్రతతో దాదాపు ఏడు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో కొందరు భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మరికొందరు గాఢ నిద్రలో ఉండగానే... భూకంపం సంభవించడంతో చాలా మంది శిథిలాల కిందే చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 35 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఏజెన్సీ చీఫ్ డార్నో మజీద్ తెలిపారు. భవనాలు నేలమట్టమవడంతో చాలా మంది చిక్కుకుపోయారనీ, దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు చెప్పారు. డిజాస్టర్ ఏజెన్సీ సమాచారం ప్రకారం.. మజెని ప్రాంతంలో 637 మంది, మముజు ప్రాంతంలో 20 మందికి పైగా గాయపడ్డారు. కాగా.. గురువారం కూడా ఇదే ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది. ఇక్కడ గడిచిన 24 గంటల్లో 26 సార్లు భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 'రింగ్ ఆఫ్ ఫైర్' ఇండోనేసియాలో భూకంపాలు తరచుగా సంభవిస్తుంటాయి. 2018లో ఇదే సులవేసి దీవిలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించి సునామీ వచ్చింది. ఆ ప్రకృతి విపత్తులో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.