Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాణ స్వీకారం నేపథ్యంలో గట్టి బందోబస్తు చర్యలు
వాషింగ్టన్ : బుధవారం అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా బైడెన్, కమలాహారిస్లు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో రాజధాని వాషింగ్టన్ దుర్భేధ్యమైన కోటగా మారిపోయింది. ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని పెద్ద ఎత్తున అల్లర్లు, సాయుధ హింసాకాండ జరిగే అవకాశాలు వున్నాయంటూ గత కొద్ది వారాలుగా భద్రతా సంస్థలకు హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. 25వేలకు పైగా జాతీయ రక్షణ దళాలను మోహరించారు. వీరితో పాటు స్థానిక పోలీసు సిబ్బందిని, ఇతర భద్రతా సంస్థలకు చెందిన వారిని వేలాదిగా నియమించారు. దీంతో కేపిటల్ హిల్, పెన్సిల్వేనియా ఎవెన్యూలో ప్రధాన భాగం, వైట్హౌస్ ప్రాంతాలన్నీ సాధారణ ప్రజానీకానికి అందుబాటులో లేకుండా పోయాయి. 8అడుగుల ఎత్తైన ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. వాషింగ్టన్ డిసిలోని మెజిస్టిక్ నేషనల్ మాల్లోని ప్రధాన భాగాల్లో దాదాపు 4వేల మంది అధికారులను అమెరికన్ మార్షల్స్ మోహరించింది. సాధారణంగా ప్రమాణ స్వీకారం సమయంలో చూసేందుకు ఈ మాల్ చుట్టుపక్కలకు వేలాదిమంది ప్రజలు వస్తారు. ఆ ప్రాంతాన్ని మూసివేశారు. జనవరి 6న కేపిటల్ హిల్పై దాడి వంటి సంఘటనలు జరిగే అవకాశముందంటూ వివిధ గ్రూపుల నుండి పలు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో అధికారులు మొత్తంగా నగరాన్ని దుర్బేధ్యం చేశారు. అందరినీ అప్రమత్తం చేశారు. ఇది కాకుండా రాష్ట్రాల రాజధానుల్లో కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అధికార బదిలీ సాఫీగా సాగేందుకు అవసరమైన ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఇంతటి బందోబస్తు ఎన్నడూ చేయలేదని వాషింగ్టన్ మేయర్ మురియల్ బౌజర్ వ్యాఖ్యానించారు. అవసరమైతే రంగంలోకి దిగేందుకు సైన్యం కూడా సంసిద్ధంగా వుందని చెప్పారు. కార్యక్రమం అంతా సజావుగా సాగేందుకు సీక్రెట్ సర్వీస్ బలగాలు తమ సరంజామాతో సన్నద్ధంగా వున్నాయన్నారు.