Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా నియంత్రణకే తొలి ప్రాధాన్యత
వాషింగ్టన్ : దేశాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే జో బైడెన్ పదిహేను కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. వీటిలో ముఖ్యమైనవి వాతావరణ మార్పులకు సంబంధించిన పారిస్ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరడం, వంద రోజుల పాటు మాస్క్ ధరించడం తప్పనిసరి చేయడం, అరడజను దాకా ముస్లిం దేశాలపై ట్రంప్ గతంలో విధించిన ప్రయాణ నిషేధాన్ని రద్దు చేయడం వంటివి వున్నాయి. ట్రంప్ తీసుకున్న వివాదాస్పద, పచ్చి మితవాదంతో కూడిన విధాన నిర్ణయాలను వెనక్కి తీసుకునేందుకు బైడెన్ యత్నించారు. ఇమ్మిగ్రేషన్పై సమగ్ర బిల్లును కాంగ్రెస్కు పంపడం బైడెన్ తొలి చర్యల్లో ఒకటిగా వుందని వైట్హౌస్ కొత్త అధికారులు తెలిపారు. ట్రంప్ రుద్ది వెళ్లిన ఇమ్మిగ్రేషన్ విధానంలో కూడా మార్పులు తేవాలని బైడెన్ యోచిస్తున్నారు. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డులపై విధించిన పరిమితిని తొలగించాలని భావిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే బైడెన్ తన ఎజెండా అమలుకు ఉపక్రమించినట్లు వైట్హౌస్ కొత్త పత్రికా కార్యదర్శి జెన్ సాకి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న నాలుగు సంక్షోభాలను పరిష్కరించడానికి మొత్తంగా తన సమయాన్ని వెచ్చించాలని బైడెన్ భావిస్తున్నారని ఆమె తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అమెరికా వైదొలగడాన్ని బైడెన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.