Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా మరణాలు 20 లక్షలకు పైనే..
- కొత్త వేరియంట్లు ఆందోళనకరం: డబ్ల్యూహెచ్వో
జెనీవా: బ్రిటన్లో వెలుగుచూసి.. ఆ దేశంలో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ మరిన్ని దేశాలకు వ్యాపిస్తోంది. ఇప్పటికే యూకే రకం కరోనా వేరియంట్ను దాదాపు 60 దేశాల్లో గుర్తించామని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. గత వారం రోజుల్లో మరో పది దేశాల్లో ఈ కొత్త వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్టు తెలిపింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాలు 20 లక్షలు దాటడంతో.. కొత్త వేరియంట్ ఆందోళనకరమని పేర్కొంది. బ్రిటన్ కొత్త రకం కరోనా వేరియంట్తో పాటు సౌతాఫ్రికా రకం వైరస్ కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. సౌతాఫ్రికా కరోనా వేరియంట్ కూడా 23 దేశాలకు వ్యాపించిందని తెలిపింది. గత వారం రోజుల్లో కరోనా వల్ల 93 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్టు డబ్ల్యూహెచ్వో వారాంతపు నివేదికలు వెల్లడించాయి. ఇదే సమయంలో మరో 4.7 కోట్ల మందికి వైరస్ సంక్రమించినట్టు పేర్కొంది.
అలాగే, కరోనా వ్యాక్సిన్లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చేంత వరకూ వైరస్ వ్యాప్తిని తగ్గించే క్రమంలో ప్రపంచదేశాలు ఆందోళనకు గురవుతున్నాయని తెలిపింది. డిసెంబర్లో గుర్తించిన ఈ బ్రిటన్ వేరియంట్ కరోనా వైరస్ 70 శాతం వేగంగా వ్యాపిస్తున్నదని పేర్కొంది. ఇక ఐరోపాలో ఇటీవలే సామూహిక టీకాలు ఇచ్చే కార్యక్రమం ప్రారంభం.. అక్కడ వైరస్ వ్యాప్తికి ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నారు. దీనిలో భాగంగా ఆగస్టు చివరి నాటి 70 శాతం జనాభాకు టీకాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు యురోపియన్ యూనియన్ పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా వైరస్ కేసులు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, రష్యా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, టర్కీ, స్పెయిన్, జర్మనీ దేశాలు టాప్-10లో ఉన్నాయి.