Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 35 కోట్ల మందికి పైనే..
- ఆహార ధరల పెరుగుదల, అంటువ్యాధుల కారణం
- 68.8 కోట్లమందికి పోషకాహారలోపం : ఐక్యరాజ్యసమితి
- కోవిడ్ -19 కారణంగా ఉపాధికి దూరం
- భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు
కోవిడ్-19 విజృంభించాక అందరి జీవితాలు చెల్లాచెదురయ్యాయి. సంపన్నవర్గాలు మాత్రం ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సాఫీగా బతికితే.... బడుగు బతుకులు మాత్రం పట్టెడన్నం దొరక్క పస్తులుండక తప్పటంలేదు. కనీసం తాగటానికి గంజినీళ్లు కూడా దక్కక.. కాలే కడుపులతో తమ బతుకులను లాక్కుని వచ్చారన్న కఠోరవాస్తవాల నివేదికను ఐక్యరాజ్యసమితి (యూఎన్ఓ) విడుదలచేసింది.
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి నాలుగు ఏజెన్సీల నివేదిక చూస్తే... ఆకలికోరలు ఏవిధంగా విరుచుపడ్డాయో విధితమవుతున్నది. కరోనా మహమ్మారి ప్రపంచంలోని సుమారు 1.9 బిలియన్ల (190కోట్ల)మందికి పోషకాహారాన్ని పొందడం కష్టతరం చేస్తున్నది. తాజా అంచనాల ప్రకారం, ప్రపంచంలో 68.8 మిలియన్ల (68.8 కోట్ల)మంది పోషకాహార లోపంతో ఉన్నారు. వారిలో సగానికి పైగా ఆసియాలో ఉన్నారు.
ప్రతీ పది మందిలో నలుగురు పోషకాహార లోపంతో ఉన్నారని తాజా అధ్యయనంలో తేలింది. ఇందుల ఆఫ్ఘనిస్తాన్ మొదటి స్థానంలో ఉన్నట్టు తేలింది. కోవిడ్ -19 వైరస్ విజృంభణతో.. ఉద్యోగాలు పోవటమేకాదు.. భగ్గుమంటున్న ఆహార ధరలతోనూ ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో 35 కోట్లకు పైగా ప్రజలు ఆకలితో ఉండి ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా.
అంటువ్యాధి బారిన పడిన 2019 డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. అంటువ్యాధి, లాక్డౌన్ ప్రభావం కారణంగా 2020లో ప్రథమార్థంలో 1.4 కోట్ల మంది ఆకలి అంచుకు చేరుకున్నారని అంచనా. ఇక గత ఏడాది చివరి నాటికి సుమారు 26.5 కోట్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరత సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు.
ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓఓ), యూనిసెఫ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం (డబ్ల్యూఎఫ్పీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ నివేదికలు విడుదల చేశాయి. తూర్పు తైమూర్, పాపువా న్యూ గినియాతో సహా పలు చోట్ల సమస్య తీవ్రంగా ఉన్నదని ప్రస్తావించాయి..
కరోనా సంక్షోభం, అంటువ్యాధి కారణంగా ఉపాధికి దూరమయ్యారు. వలసకార్మికులూ రోడ్లపై స్వరాష్ట్రాలకు తరలివెళ్లారు. ఇలా ఎన్నో కుటుంబాలకు తగినంత ఆహారం లభించడం లేదు. చివరికి అగ్రదేశమైన అమెరికాలోనూ వివిధ సంస్థలచే ఆహార ప్యాకెట్ల పంపిణీ చేసేటపుడు ఉద్యోగాలు కోల్పోయిన వారు క్యూలైన్లలో నిలబడకతప్పలేదు.
ముందస్తు చర్యల్లేకుండా లాక్డౌన్తో...
ముందస్తు ప్రణాళిక లేకుండా భారత్లో విధించిన లాక్డౌన్ వల్ల పేద బతుకులపై తీవ్ర ప్రభావం చూపింది. రవాణా స్థంభించటంతో ఆహారధాన్యాల సరఫరాకు ఆటంకం ఏర్పడినట్టు నివేదిక పేర్కొంది. రోజువారీ వేతనం, వలస కూలీలు ఎక్కువగా నష్టపోయారు.
ఆసియాలో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల ధరల పెరుగుదల తక్కువ ఆదాయ కుటుంబాలకు అవసరమైన ఆహార పదార్థాలను కొనడం కష్టమైందని తెలిపింది. ఐక్యరాజ్యసమితి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓఓ) గణాంకాల ప్రకారం, నవంబరులో గత ఆరేండ్లలో ఆహార పదార్థాల ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. 'కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తితో అనేక ప్రాంతాల్లో సరైన ఉపాధిఅవకాశాలు లేకపోవడం, ఆహార పంపిణీ వ్యవస్థలు దిగజారటం, వెరసి మార్కెట్లలో గణనీయమైన అనిశ్చితి అసమానతల్ని మరింతగా పెంచాయని నివేదిక తెలిపింది.
తగ్గిన ఉత్పత్తులు ..పెరిగిన ధరలు
ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లోని అనేక దేశాలలో పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తుల తగ్గిపోయాయి. ధరలు అమాంతంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో పేద ప్రజలకు పోషకమైన ఆహారాన్ని అందించడం దాదాపు అసాధ్యమని అభిప్రాయపడింది.
2019 నాటికి ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సుమారు 35 కోట్ల మంది పౌష్టికాహార లోపంతో ఉన్నట్టు అంచనా .వీరిలో ఐదేండ్ల లోపు 70 మిలియన్ల (ఏడుకోట్ల) మంది పిల్లలు పౌష్టికాహార లోపం కారణంగా..బరువులో తేడా ఉన్నట్టు గుర్తించింది. మరో 30 మిలియన్ల (మూడుకోట్ల)మంది చిన్నారులు పెరగాల్సిన ఎత్తుకు తగ్గట్టు లేరని తేలింది. దీనికి తోడు బలహీనంగా ఉన్నట్టు గమనించింది.
యూఎన్ ఏజెన్సీల సూచనలివే..
తల్లీబిడ్డలకూ పోషకాహారాన్ని అందించడానికి కృషి చేయాలి. వీటితో పాటు ఇతర ముఖ్యమైన అంశాలను పరిష్కరించడానికి సమగ్ర వ్యవస్థ ఏర్పాటు వైపు ప్రభుత్వాలు దృష్టిసారించాలని యూఎన్ ఏజెన్సీలు పిలుపునిచ్చాయి. వీటిలో ఆహారం, నీరు, పారిశుధ్యం, ఆరోగ్యం, సామాజిక రక్షణ, విద్యా వ్యవస్థలు ఉన్నాయి.
2030 నాటికి పేదరికంలో 20 కోట్లమందికి పైనే
డిసెంబరులో, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) అధ్యయనం ప్రకారం.. 2030 నాటికి 20.70 కోట్ల మంది పేదరికం కోరల్లోకి చేరుకుంటారని తేలింది.
ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడిన మహమ్మారి దెబ్బకు మొదటి 12 నెలల్లో లక్షలాది మంది చిన్నారులు ఆకలితో అలమటించారని గుర్తించింది. కరోనా వైరస్, దానిని ఎదుర్కోవటానికి విధించిన ఆంక్షల వల్ల అనేక వర్గాలు ఇప్పటికీ ఆకలి బాధలు ఎదుర్కొంటున్నాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఒక్కో నెలలో దాదాపు 10,000 మందికి పైగా పిల్లలు మృత్యుఒడిలోకి వెళుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది.
ఇవే కాకుండా... కరోనా వైరస్ సంక్షోభంతో భారతదేశంలో అసంఘటిత రంగాల్లా పనిచేస్తున్న సుమారు 400 మిలియన్ల మంది పేదరికంలో చిక్కుకోవచ్చని ఐక్యరాజ్యసమితి కార్మిక సంస్థ హెచ్చరించింది