Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తేజపూరిత వాతావరణంలో వియత్నాం కమ్యూనిస్టు పార్టీ 13వ మహాసభ ప్రారంభం
హనోయ్ : ఆగ్నేయాసియా ప్రాంతానికే వన్నె తెచ్చిన వియత్నాం స్వాతంత్య్రాన్ని, సోషలిజాన్ని పరిరక్షించేందుకు పునరంకితం కావాలని వియత్నాం కమ్యూనిస్టు పార్టీ 13వ జాతీయ మహాసభ ఉద్ఘాటించింది. అరుణ పతాక రెపరెపలు, కారల్మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, హోచిమిన్ వంటి మహోన్నతుల చిత్ర పటాలు, తోరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన హనోయి నగరంలో అత్యంత ఉత్తేజపూరిత వాతావరణంలో మహాసభ ప్రారంభమైంది. సోమవారం నుండి తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ మహాసభకు దేశంలోని 51 లక్షలకు పైగా ఉన్న పార్టీ సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తూ మొత్తం 1587 మంది ప్రతినిధులు హాజరయ్యారు. గత మహాసభతో పోల్చితే ఈ సారి ప్రతినిధుల సంఖ్య 80 దాకా పెరిగింది. ఫిబ్రవరి2న పార్టీ నూతన నాయకత్వ ఎన్నికతో మహాసభ ముగుస్తుంది. వచ్చే మే నెలలో వియత్నాం పార్లమెంటు ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఈ మహాసభ అత్యంత ప్రాముఖ్యత కలిగిన రాజకీయ సంఘటనగా నిలిచిపోతుందని పరిశీలకులు భావిస్తున్నారు. మహాసభ ప్రారంభానికి ముందు వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, దేశాధ్యక్షుడు ఎంగుయెన్ ఫు త్రాంగ్ మాట్లాడుతూ మార్క్సిజం, లెనినిజం, హోచిమిన్ ఆలోచనా విధానాన్ని సృజనాత్మకంగా వర్తింపజేసి దేశాన్ని వేగంగా అభివృద్ధిచేయడంలో 35 ఏండ్ల పునరుద్ధరణ (డొయి మొయి) కార్యక్రమం, 2011-20 సామాజిక, ఆర్థిక వ్యూహం కీలక భూమిక వహించాయని అన్నారు. పునరుద్ధరణ ప్రక్రియను అత్యంత ముఖ్యమైన కర్తవ్యంగా ఆయన ఉద్ఘాటించారు. దీంతోబాటు ఈ ప్రాంతంలోను, మిగతా ప్రపంచంలోను చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు, తలెత్తిన సంక్లిష్ట పరిస్థితులు దేశంపైన, దాని ప్రజలపైన ప్రత్యక్షంగా, పరోక్షంగా చూపిన సానుకూల, ప్రతికూల ప్రభావాల గురించి మహాసభ కూలంకషంగా చర్చించనున్నది. 1930లో వియత్నాం కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటైన తర్వాత జరుగుతున్న 13వ మహాసభ ఇది. కరోనా, అంతకు ముందు సంభవించిన భారీ వరదలు వియత్నాంను అతలాకుతలం చేశాయి. ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోను వియత్నాం ఆర్థిక వ్యవస్థ తిరిగి నిలదొక్కుకుని వడివడిగా ముందుకు సాగుతున్నది. 1989లో 300 కోట్ల డాలర్లుగా ఉన్న వియత్నాం జీడీపీ 2020 నాటికి వచ్చేసరికి 34,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. సమీప భవిష్యత్తులో అది సింగపూర్ను దాటేసి ఆగేయాసియాలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించనున్నదని ఐఎంఎఫ్ అంచనా. వియత్నాం ప్రజల తలసరి ఆదాయం 1985లో 159 డాలర్లు ఉండగా, 2015 నాటికి అది ఒకటిన్నర రెట్లు పెరిగింది. 2016-20 మధ్య వియత్నాం ఆర్థిక వృద్ధి రేటు సగటున 5.9 శాతంగా నమోదయింది. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలలోను గణనీయమైన పురోభివృద్ధి సాధించింది. 2020-21 సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వితేతర సభ్యురాలి హోదాను 192/193 ఓట్ల మెజార్టీతో దక్కించుకుంది. కోవిడ్-19తో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు మైనస్ 4 శాతానికి పడిపోయిన ఈ స్థితిలో సైతం వియత్నాం 2.91 శాతం వృద్ధి రేటు సాధించడం విశేషం. వియత్నాం కమ్యూనిస్టు పార్టీ సభ్యులు, దేశ పౌరులు, అధికారులు వియత్నాం సాధించిన విజయాల పట్ల, సోషలిజం ఔన్నత్యం పట్ల తమ పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహాసభను పురస్కరించుకుని వచ్చే ప్రతినిధులు, విదేశీ ప్రతినిధులు, ఇతర సిబ్బంది, మీడియా అందరూ కలిసి మొత్తంగా 10 వేల మందికి కరోనా పరీక్షలు చేయించారు అందరికీ రెండు సార్లు నెగెటివ్ వచ్చిన తర్వాతనే అనుమతిస్తు న్నామని వియత్నాం ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.