Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆస్టిన్ : అమెరికాలో ఇటీవల మంచు తుఫాను వల్ల పలు ప్రాంతాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. వీటిలో టెక్సాస్ కూడా ఒకటి. సకాలంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోవడంతో వరుసగా నాలుగు రోజుల నుండి టెక్సాస్లోని దాదాపు 45 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు దుప్పటి కప్పేయడంతో శీతలమయమైన పరిస్థితుల్లో హీటర్లు కూడా లేకపోవడంతో ప్రజల బాధలు వర్ణనాతీతం. టెక్సాస్ రాజధాని ఆస్టిన్ వంటి చోట్ల మైనస్ 13ల్లోకి ఉష్ణోగ్రతలు వెళ్లిపోయాయి. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బ్లాకవుట్ అయిన ఈ పరిస్థితి విద్యుత్ ఉత్పాదనలో కొరత వల్ల కలిగినది కాదు. ప్రైవేటు కార్పొరేషన్లు, కొందరు ప్రభుత్వాధికారులు వినాశకర విధానాలే దీనికి ప్రధానకారణమని వెలుగులోకి వచ్చింది. పెట్టుబడిదారుల లాభార్జనే ఇక్కడ ప్రధానంగా మారడం ఆందోళన కలిగించే అంశం. బుధవారం నాటికి టెక్సాస్లో అతిపెద్ద నగరమైన హ్యూస్టన్లో 14 లక్షల మంది ప్రజలు అంథకారంలో వున్నారు. రెండో అతిపెద్ద నగరమైన డల్లాస్లో నాల్గో వంతు ప్రజలు చీకటిలో మగ్గారు. ఒక పక్క శీతల పవనాలు, మరో పక్క విద్యుత్ కోత కారణంగా 29 మంది మరణించారు. రోడ్డు ప్రమాదాలు, ఇళ్ళలో కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువై ప్రమాదాలు జరగడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. పదేళ్ళ క్రితం ఇలాగే ఫిబ్రవరిలో టెక్సాస్లో విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా వుండేలా తీసుకోవాల్సిన చర్యలపై పలు అధ్యయనాలు జరిగాయి. హెచ్చరికలు చేశారు. కానీ ఈసారి కొవిడ్ పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ సంక్షోభం ప్రకృతి విపత్తు కాదు, ఆనాటి హెచ్చరికలను ఉద్దేశ్యపూర్వకంగా, నేరపూరితంగా పెడచెవిన పెట్టిన ఫలితమిదని సంబంధిత నిపుణులు విశ్లేషించారు. ప్రస్తుత సంక్షోభం వెనుక రాజకీయ, ఆర్థిక పరమైన నిర్ణయాలు, కారణాలు వున్నాయి. టెక్సాస్ పవర్ గ్రిడ్ ప్రధాన జాతీయ గ్రిడ్లతో అనుసంథానమై లేకపోవడం వల్ల సంక్షోభ సమయంలో బయటి నుండి విద్యుత్ సరఫరా సాధ్యం కాదనీ, ఆదివారం రాత్రి సంభవించిన సంక్షోభానికి ఇదే కారణమని నిపుణులు పేర్కొన్నారు.