Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : వైట్హౌస్ బడ్జెట్కు అధ్యక్షురాలిగా బైడెన్ ఎంపిక చేసిన నీరాటాండెన్ ధృవీకరణను తాను వ్యతిరేకిస్తున్నానని డెమోక్రటిక్ సెనేటర్ జో మంచీన్ శుక్రవారం ప్రకటించారు. పక్షపాతంతో కూడిన ఆమె బహిరంగ ప్రకటనలు కాంగ్రెస్ సభ్యులకే కాకుండా నిర్వహణ, బడ్జెట్ కార్యాలయం డైరెక్టర్ల మధ్య సత్సంబంధాలపై హానికరమైన ప్రభావాన్ని చూపుతాయని తాను విశ్వసిస్తున్నానని మంచీన్ పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆమెకు తాను మద్దతు ఇవ్వలేనని ఆయన స్పష్టం చేశారు. కాగా, అధ్యక్షుడు బైడెన్ నామినేషన్లను ధృవీకరించే, తిరస్కరించే అధికారం సెనెట్లోని డెమోక్రాట్లకు ఉంది. 50 మంది రిపబ్లికన్లకు వ్యతిరేకంగా 50 డెమోక్రాట్ల సీట్ల లెక్కింపులో ఉపాధ్యక్షురాలు కమల హారిస్ ఓటును కూడా పరిగణనలోకి తీసుకుంటారు. టాంటెన్ను నిర్థారించేందుకు కనీసం ఒక రిపబ్లికన్ అవసరం ఉంటుంది. కాగా, తాను నామినేట్ చేసిన నీరా టాండన్ ఎన్నికపై వెనక్కు తగ్గేది లేదని బైడెన్ ఒక సమావేశంలో వెల్లడించడం గమనార్హం.
కాగా, నీరాటాండన్ నిష్ణాతురాలైన నిపుణురాలు.. ఆమె అధ్బుతమైన బడ్టెట్ డైరెక్టర్గా వ్యవహరించగలరని వైట్ హౌస్ ప్రతినిధి జెన్సాకి శుక్రవారం వెల్లడించారు. తన కెరీర్లో .. కార్మికుల కుటుంబాలకు మద్దతు ఇవ్వడానికి, ఆర్థిక వృద్ధిని పెంపొందించడానికి స్థానికంగా నెలకొన్న అసమానతలను తగ్గించేందుకు రూపొందించిన విధానాలను అమలు చేయడం ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారని.. దీంతో ఆఫీస్ ఆఫ్ మెనేజ్మెంట్ అండ్ బడ్జెట్ (ఒబిఎం) అధ్యక్షురాలిగా నామినేట్ చేసామని బైడ్న్ బృందం పేర్కొంటోంది. సెనెట్ బడ్జెట్ కమిటీలో బుధవారం జరగాల్సిన విధానపరమైన ఓటింగ్తో వచ్చేవారం మొదటి పరీక్ష జరగనుంది.
అధ్యక్షుడి బడ్జెట్ రూపొందించడంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా అధ్యక్షుడి శాఖ కార్యదర్శుల ప్రాజెక్టులు, ఖర్చులను అంచనా వేయడానికి ఒబిఎం శక్తివంతమైన విభాగం. మరోవైపు, ఒబిఎం అధ్యక్షురాలిగా నామినేట్ అయిన మొదటి భారతీయ అమెరికన్ టాండన్ కావడం గమనార్హం. నవంబర్లో బైడెన్ ఆమెను నామినేట్ చేసినప్పటి నుండి ద్వైపాక్షిక విమర్శలకు గురవుతున్నారు. ఆమె ఎంపికపై రిపబ్లికన్ల నుండే కాకుండా బైడెన్ సొంత పార్టీ సభ్యులైన డెమోక్రాట్ల నుండి కూడా విమర్శలు ఎదురవుతుండటంతో రాజకీయం ప్రమాదంలో పడినట్లు తెలుస్తోంది.