Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెజిల్ వ్యాప్తంగా 40 నగరాల్లో ఆందోళనలు
బ్రసీలియా : కోవిడ్ మహమ్మారి దేశంలో ప్రబలుతున్నప్పటికీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధ్యక్షుడు జేర్ బోల్సనారో తక్షణమే గద్దె దిగాలని కోరుతూ శని, ఆదివారాల్లో దేశవ్యాప్తంగా 40కి పైగా నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి. సైకిళ్ళపై, వాహనాలపై పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రాజెక్టును మరింత పటిష్టపరచాలని డిమాండ్ చేశారు. కరోనా పూర్తిగా వైదొలగేవరకు నెలకు 600 డాలర్లు ఆర్థిక సాయాన్ని అందచేయాలని కోరారు. తక్షణమే వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు కరోనా నుండి రక్షణ, ఉపాధి భద్రత కల్పించాలన్న డిమాండ్తో దేశవ్యాప్తంగా ప్రదర్శనలు సాగాయి. కోవిడ్ను కేవలం జలుబు, లేదా ఫ్లూగా పరిగణిస్తూ అధ్యక్షుడు ప్రదర్శించిన నిర్లక్ష్యపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ ఈ ప్రదర్శనలు నిర్వహించారు. ఇప్పటివరకు బ్రెజిల్లో 2.5 లక్షల మంది వరకు మరణించారు. కోటికి పైగా కేసులు నమోద య్యాయి. ప్రస్తుత సమయంలో ఉపాధి, ఆహారం, చవకగా ఇంధనం కావాలని, అభివృద్ధికి, ప్రజలు సుఖంగా జీవించడానికి అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని వర్కర్స్ పార్టీ అధ్యక్షుడు గ్లెయిసి హాఫ్మన్ వ్యాఖ్యానించారు.