Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాస సమావేశాల్లో భారత్
ఐక్యరాజ్య సమితి : తక్షణమే, సముచితమైన రీతిలో ప్రతిస్పందించాల్సిన పరిస్థితి తలెత్తినపుడు ఆత్మరక్షణతో వ్యవహరించడం ఒక దేశానికి గల ప్రాథమిక హక్కని భారత్ పేర్కొంది. ప్రభుత్వేతర వర్గాలు చేసే దాడులకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో భారత్ శాశ్వత డిప్యూటీ ప్రతినిధి కె.నాగరాజ్ నాయుడు మాట్లాడుతూ, భారత్ తన పొరుగు దేశం నుండి ముంబయి దాడులతో సహా అనేక తీవ్రవాద దాడులను, సరిహద్దు ఆవలి నుండి పలు పరోక్ష యుద్దాలను ఎదుర్కొందని అన్నారు. ఐక్యరాజ్య సమితి నిబంధనావళిలోని సమిష్టి భద్రతా వ్యవస్థను పరిరక్షించడంపై జరిగే అరియా ఫార్ములా సమావేశంలో ఆయన బుధవారం మాట్లాడారు. 1974 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిక్లరేషన్ ప్రకారం ఒక సభ్య దేశం తన భూభాగాన్ని మరో దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకలాపాలు చేపట్టేందుకు అనుమతించరాదని పేర్కొంటోంది.
భద్రతా మండలి కూడా అన్ని దేశాలకు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ కొన్ని దేశాలు అంతర్జాతీయ అభిశంసనను తప్పించుకునేందుకు తీవ్రవాద గ్రూపులకు పరోక్షంగా సహకరిస్తూ పరోక్షంగా యుద్ధం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కేవలం దేశాలు పాల్పడే దాడులకు మాత్రమే ఈ ఆత్మరక్షణ నిబంధన పరిమితం కాలేదని అంటూ ఐక్యరాజ్య సమితి నిబంధనావళిలోని 51వ అధికరణను ఆయన ఉటంకించారు. ప్రభుత్వేతర వర్గాలు పాల్పడే దాడులకు కూడా ఈ ఆత్మరక్షణ హక్కు వర్తిస్తుందని స్పష్టం చేశారు.