Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాది నాటికి 64శాతం చైనా ప్రభుత్వ లక్ష్యం
బీజింగ్ : జూన్ చివరి నాటికి 40శాతం మంది జనాభాకు వ్యాక్సిన్ వేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తంగా 64శాతం మందికి టీకాలు అందాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా వుందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. ఇందుకోసం ముమ్మర చర్యలు చేపడుతోంది. మరింత వేగంగా, అధిక శాతం ప్రజలకు టీకాలు అందేలా చేయడానికి కావాల్సిన సన్నద్ధతపై చర్చించేందుకు మంగళవారం దేశవ్యాప్తంగా ప్రాంతీయ సిడిసి(సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్) బ్రాంచ్ అధికారులందరినీ సమావేశపరిచారు. జులైలో పార్టీ శతాబ్ది ఉత్సవాలు, ఈ ఏడాది రెండో అర్ధభాగంలో అంతర్జాతీయ సమావేశాలు, ప్రధానమైన క్రీడా కార్యక్రమాలు వున్నందున, పైగా 2022 బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కు సమాయత్తం కావాల్సినందున అత్యంత శీఘ్రగతిన టీకా కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇమ్యూనైజేషన్ గ్యాప్ను నివారించేందుకు సాధ్యమైనంత రీతిలో ప్రపంచ దేశాలతో ఈ విషయంలో పోటీ పడాలని భావిస్తున్నట్లు పేర్కొంది. 140కోట్ల మంది జనాభా కలిగిన చైనాలో దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రణాళికలో భాగంగా ఎక్కడికక్కడ స్థానికంగా లక్ష్యాలను పెట్టుకున్నారు. రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా విధించిన లక్ష్యాలు, చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి కావడం పెద్దసవాలుతో కూడినదని నిపుణులు పేర్కొంటున్నారు. వ్యాక్సిన్ సరఫరాలకు తీవ్ర కొరత వున్న నేపథ్యంలో సకాలంలో లక్ష్య సాధన ఎంతవరకు అమలవుతుందో చూడాల్సి వుందని అన్నారు.