Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భగం చేసిన రష్యా పోలీసులు
మాస్కో : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మాస్కోలో పేలుళ్లు జరిపి భారీ విధ్వంసాన్ని సృష్టించేందుకు పన్నిన కుట్రను రష్యా పోలీసులు భగం చేశారు. వారి ముందస్తు చర్యలతో పెను ప్రమాదం తప్పినట్టయింది. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు రష్యా పోలీసులు సోదాలు జరిపారు. భారీ పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అంతేగాకుండా భారీ విస్ఫోటనం జరిపేందుకు ఉగ్రవాదులు అమర్చిన 4కిలోల బాంబును నిర్వీర్యం చేశారు. మాస్కో చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విషయాన్ని రష్యా నేషనల్ యాంటీ టెర్రరిస్ట్ కమిటీ స్పష్టం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాస్కోలోని స్ట్రెల్ బిష్ చెంకీ పెర్లాక్ నివాస సముదాయంలో బాంబును గుర్తించారు. ఆ ప్రాంతంలోని దాదాపు 120 కుటుంబాలను ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్ బృందాలు ప్రత్యేక తనిఖీలు చేపట్టాయి. బాంబులు గుర్తించిన ప్రాంతాల్లో గ్యాస్ పంపిణీని నిలుపుదల చేశారు. పోలీస్ గస్తీని నిర్వహించి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల అణచివేతకు రష్యా ఇటీవల ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్న సంగతి తెలిసిందే.
కారు బాంబు పేలుళ్లతో 5 గురి మృతి : మాస్కో రెడ్ స్క్వేర్ ప్రాంతంలోని నేషనల్ హోటల్ వద్ద కారు బాంబు పేలడంతో ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడులకు వ్యాపార లావాదేవీలే కారణమని పోలీస్ వర్గాలు గుర్తించాయి. ఈ ప్రాంతంలో ఓ గుర్తుతెలియని మహిళ జరిపిన ఆత్మాహుతి దాడితోనే ఈ పేలుళ్లు సంభవించాయని పోలీసుల నిర్ధారణలో తేలింది. సంఘటనాస్థలిలో లభించిన ఆధారాల ప్రకారం ఈ దాడులకు పాల్పడినది ఉగ్రవాదులు కారని ఓ పోలీస్ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. ఇటీవల రష్యాలో వాణిజ్య లావాదేవీలతో సంబంధమున్న హత్యానేరాలు అధికమయ్యాయన్నారు. కాగా దక్షిణ రష్యా ప్రాంతంలోని ఓ రైలులో గత వారం జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 44 మంది మృతి చెందారు.