Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శరణార్థులను ఆదుకోవటంపై జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్
బెర్లిన్: మధ్యప్రాచ్యం శరణార్థులను ఆదుకోవట మన్నది కనీస బాధ్యత అని జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ అన్నారు. అయితే ఈ సమస్యను పరిష్కరించే పని తనది కాదని సోమవారం మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమె పేర్కొన్నారు. దేశంలో శరణార్థులకు ఆశ్రయం కల్పించటంపై జర్మన్లకున్న భయాల్ని తాను అర్థం చేసుకోగలనని ఆమె చెప్పారు. ఈ ఏడాదిలో 8 నుంచి 10 లక్షల మంది శరణార్థులకు ఆశ్రయం కల్పించాలన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ఆపదలో సాటి మనిషి ఉన్నప్పుడు కనీస మానవత్వం చూపాలనుకునే వ్యక్తిగా శరణార్థులను ఆదుకోవటంలో దేశం కూడా అలాగే వ్యవహరించాలని అన్నారు. కొంతమంది జర్మన్ పౌరులు తమ ఇండ్లల్లో శరణార్థులకు ఆశ్రయం కల్పించటాన్ని మెర్కెల్ ప్రశంసించారు. రాజకీయ పక్షాల నుంచి వస్తున్న విమర్శల్ని ఆమె తోసిపుచ్చారు.
'రెండో ప్రపంచయుద్ధం తర్వాత నెలకొన్న అతిపెద్ద వలసదారుల సమస్య ఇది. అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి జర్మనీ, ఇతర యూరప్ దేశాలు సిరియా శరణార్థుల సమస్యను పరిష్కరించగలమన్న నమ్మకముంది. పాశ్చాత్య దేశాలతో సహా అరబ్, రష్యా, ఇతర ప్రాంతీయ శక్తులేవీ సిరియాలో విజయం సాధించలేకపోయాయి. శరణార్థులకు ఆశ్రయం కల్పించటంపై ఇయు దేశాల మధ్య పంపకాలు జరగాల్సివుంది. తద్వారా సరిహద్దు వ్యవస్థను కాపాడుకోవాలి'' అని మెర్కెల్ అన్నారు.