Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాలి ఉగ్రదాడిలో ముగ్గురు చైనీయులు మృతి
- అనుమానితల కోసం మాలి భద్రతా బలగాల గాలింపు
బమాకా : మాలి రాడిసన్ బ్లూ హోటల్లో ఎంత మంది ఉగ్రవాదులు దాడి చేశారనే విషయంలో అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు...దాదాపు 13 మంది ఉగ్రవాదులు గాడ్ ఈజ్ గ్రేట్ అంటూ నినాదాలు చేస్తూ హోటల్లోకి సాయుధులై దూసుకెళ్లారని చెప్పారు. కాగా, శుక్రవారం మాలి, ఫ్రాన్స్, అమెరికా దేశాల భద్రతా బలగాలు చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ప్రకటించాయి. ఈ దాడులతో సంబంధమున్న ముగ్గురు అనుమానితుల కోసం గాలిస్తున్నామని మాలి భద్రతా బలగాలు తెలిపాయి. ఇదిలా ఉండగా, మాలిలో శాంతి స్థాపన ఎజెండాతో ఈనెల 19 నుంచి దౌత్య సమావేశాలు జరుగుతున్నాయి. కాగా, ఈ సమావేశాలకు అంతరాయం కల్గించాలనే దురుద్ధేశంతోనే ఉగ్రవాదులు మాలిలో దాడులు జరిపారని మాలిలో అమెరికా మిషన్ ముఖ్యాధికారి మోంగీ హమ్దీ అభిప్రాయపడ్డారు.
దాడులను ఖండించిన పలు దేశాధినేతలు
'మాలిలో ఉగ్రవాదం కొరడా ఝుళింపించిందని, ఇది ప్రపంచ దేశాలను భయపెట్టేందుకు ఉగ్రవాదులు అనుసరించిన దుశ్చర్య' అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల నుంచి బందీలను విముక్తి కల్పించేందుకు సాహసోపేత ఆపరేషన్ను చేపట్టిన మాలియన్ స్విఫ్ట్ బలగాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాలిలో జరిగిన ఉగ్రదాడిలో అనితా దాతర్ (41) అనే అమెరికన్ మృతి చెందారు. ఆమె కుటుంబ నియంత్రణ, హెచ్ఐవిలపై ప్రాజెక్టులను రూపొందించేందు కోసం మాలిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉగ్రవాదుల చెరలో ఉన్న ఒకరు మృతి చెందగా, మిగతా వారందరూ సురక్షితంగా బయటపడ్డారని అమెరికా అధికార ప్రతినిధి జాన్ కిర్జీ చెప్పారు. బెల్జియం పార్లమెంట్లో పనిచేసే జాఫ్రీ డీయూడోన్ అనే ఓ అధికారి కూడా ఉగ్రదాడిలో చనిపోయారు. ఇదిలా ఉండగా, అదే హోటల్లో బస చేసిన ముగ్గురు బ్రిటన్ దేశీయులు ప్రాణాపాయస్థితి నుంచి బయటపడ్డారని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి ఫిలిప్ హమ్మండ్ పేర్కొన్నారు. అంతేగాకుండా, ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో పలువురు రష్యన్లు కూడా మృత్యువాతపడ్డారని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జకారోవా వెల్లడించారు. మరోవైపు, మాలికి మద్ధతుగా నిలుస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండే ప్రకటించారు. మాలిలో ప్రత్యేక సహాయ చర్యలను అందించడం కోసం ఎలైట్ పారామిలిటరీ బలగాలను పంపామన్నారు. ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పిలుపునిచ్చారు. మాలిలో ఉగ్రవాదులు జరిపిన దాడిపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఉగ్రవాద నిర్మూలన కోసం కృషి చేస్తామని మాలి అధ్యక్షుడు కీతా తెలిపారు.
మాలిలో 10 రోజుల పాటు ఎమెర్జెన్సీ: బవుబాకర్
మాలిలో పదిరోజుల పాటు ఎమెర్జెన్సీని ప్రకటించినట్టు ఆ దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బవుబాకర్ ప్రకటించారు. దీంతో పాటు మరో మూడు రోజుల పాటు సంతాప దినాల్ని పాటిస్తామన్నారు. శుక్రవారం మాలి రాజధాని బమాకాలోని రాడిసన్ బ్లూ హోటల్పై ఉగ్రవాదులు దాడి చేసి 170 మందిని బందీలుగా తీసుకెళ్లడంతో పాటు వారిలో 27 మందిని కాల్చి చంపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రవాదుల చెర నుంచి బందీలను విడిపించేందుకు మాలి, ఫ్రాన్స్, అమెరికాకు చెందిన భద్రతా బలగాలు జాయింట్ ఆపరేషన్ను చేపట్టాయి. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
రాడిసన్ బ్లూ హోటల్పై దాడికి సంబంధించి మరో ముగ్గురు అనుమానితుల కోసం భద్రతా బలగాలు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టాయి. మాలిలో అల్-మౌరాబితౌన్, అల్ఖైదా ఇన్ ఇస్లామిక్ మఫ్ురెబ్లనే తమ అనుబంధ సంస్థలు దాడికి పాల్పడ్డాయని అల్ఖైదా ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా, ఈ దాడుల ప్రధాన సూత్రధారి అల్జీరియన్ జీహాదీ ముఖ్య నాయకుడు మొఖ్తర్ బెల్మొఖ్తర్ అని అనుమానిస్తున్నామని ఫ్రెంచ్ రక్షణ మంత్రి జీన్-యూఎస్లే డ్రియాన్ తెలిపారు. ఈ ఏడాది జూన్లో లిబ్యాలో జరిగిన వైమానిక దాడుల వెనుక బెల్మొఖ్తర్ హస్తమున్నందున అతడిని మట్టుబెట్టామని లిబ్యా అధికారులు పేర్కొన్నారు. అయితే అమెరికా అధికారులు మాత్రం బెల్మొఖ్తర్ సజీవంగానే ఉన్నాడని విశ్వసిస్తున్నారు.
మాలి దాడులను ఖండించిన చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్
మాలిలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్ని చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ఖండించారు. మాలిలో ఉగ్రవాదులు జరిపిన ఘాతుకం అనాగరికం, క్రూరమైందని పేర్కొన్నారు. చైనా సరిహద్దులో నిఘా పెంచాలని భద్రతా బలగాలను ఆదేశించారు. ఉగ్రవాద నిర్మూలన కోసం ప్రపంచ దేశాలతో కలిసి పోరాడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉగ్రవాదుల దాడుల్లో అనేక మంది అమాయకులు బలవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత, ప్రపంచ శాంతి స్థాపన కోసం ప్రతి ఒక్క దేశం పోరాడాలని పిలుపునిచ్చారు. శుక్రవారం రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఉగ్రదాడుల్లో చైనా ప్రభుత్వా ధీనంలో పనిచేసే రైల్వే కన్స్ట్రక్షన్ సంస్థకు చెందిన జనరల్ మేనేజర్ జౌ తియాంజియాంగ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వాంగ్ యువాన్షాన్, పశ్చిమ ఆఫ్రికా డివిజన్ జనరల్ మేనేజర్ ఛాన్ యూహీలు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉగ్రదాడుల్లో మృతి చెంది న చైనా అధికారుల కుటుంబాలకు చైనా రైల్వే సంస్థ ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. మాలిలో ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్న మరో నలుగురు చైనీయులు సురక్షితంగా ఉన్నారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
మాలి ఘటనలో భారత అమెరికన్ మహిళ మృతి
బమాకో : పశ్చిమ ఆఫ్రికా దేశమైన మాలి రాజధాని బమాకోలోని రాడిసన్ బ్లూలో శుక్రవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ భారత అమెరికన్ మహిళ మృతి చెందింది. అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన అనితా అశోక్ దాతర్ అనే మహిళ పల్లాడియమ్ గ్రూప్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. వృత్తిపరంగా గత రెండేళ్లుగా ఆమె సెనెగల్ దేశంలో వుంటున్నారు. అయితే శుక్రవారం ఆమె రాడిసన్ బ్లూ హోటల్లో ఉండగా, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అనిత మరణించారు. అనిత మృతిపై అమెరికా సెక్రటేరియట్ సంతాపం తెలిపింది.