Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగపూర్: సింగపూర్లో గతేడాది 4500 మంది విదేశీ శ్రామికులు తమ యాజమాన్యాలతో వేతన వివాదాలు పరిష్కరించాల్సిందిగా అక్కడి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. 2013తో పోలిస్తే ఈ సంఖ్య 25 శాతం అధికం. 2013లో 3,600మంది వేతన వివాదాల పరిష్కారం కోసం సింగపూర్ ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ రెండు వేల అభ్యర్థనలు వచ్చినట్టు తెలిపారు. 60 శాతం వివాదాలు వేతనాల్లో కోత, ఆలస్యంగా ఇవ్వడం, వేతనాలు నిలిపివేయడానికి సంబంధించినవేనని చెబుతున్నారు. తమకు ఫిర్యాదులు అందిన వెంటనే పరిష్కరించి యాజమాన్యాల నుంచి వేతనాలు ఇప్పిస్తున్నామని వలస కార్మికుల కేంద్రం డైరెక్టర్ బెర్నార్డ్ మీనన్ పేర్కొన్నారు. వేతన వివాదాలకు పరిష్కారంగా వచ్చే ఏడాది నుంచి శ్రామికులకు పే స్లిప్స్ ఇవ్వనున్నట్టు సంబంధిత మంత్రిత్వశాఖ తెలిపింది. గతేడాది ఆగస్టు వరకెల్లా 13 లక్షలమంది విదేశీ కార్మికులు సింగపూర్లో పని చేస్తున్నారు. వారిలో ఎక్కువభాగం భారత్, బంగ్లాదేశ్, చైనా,ఆగేయాసియా దేశాల నుంచి వలస వెళ్లినవారే. నిర్మాణ రంగం, సముద్ర విభాగాల్లో వీరు పని చేస్తున్నారు.