Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్: కలుషిత ఆహార ఉత్పత్తుల విక్రయాల్లో ఏ దేశమైనా ఒక్కటే. ఏ ప్రాంతమైనా ఒక్కటే. విషతుల్యమైన పుట్టగొడుగులు విక్రయించినందుకు ఆస్ట్రేలియాలోనే అతిపెద్ద గొలుసు దుకాణాల సముదాయమైన వూల్వర్త్స్ సూపర్మార్కెట్పై దావా వేసేందుకు పాతికేళ్ల భారత యువతి సన్నద్ధమైంది. న్యూకేజిల్ నివాసి అయిన రజ్వీర్కౌర్ గతేడాది ఏప్రిల్నెలలో వూల్వర్త్స్ నుంచి కొనుగోలు చేసిన పుట్టగొడుగుల వంటకాన్ని తిని తీవ్రఅనారోగ్యంపాలైంది. హుటాహుటిన ఆస్పత్రిపాలై ఓ వారం రోజులు కోమాలో కూడా ఉంది. ఆ తర్వాత నాలుగునెలల సుదీర్ఘ చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడింది. తీవ్ర అనారోగ్యం కారణంగా డాక్టర్లు తనకు అత్యవసరంగా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసారని రజ్వీర్కౌర్ తెలిపింది. కోలుకునేందుకు రోజుకు ఇరవై రకాల మందులు వాడాల్సి వచ్చిందన్నారు. కాలం చెల్లిన పుట్టగొడుగులు అమ్మినందున ఫంగస్ చేరి విషపూరితమయ్యాయని, అలాంటి పుట్టగొడుగుల్ని అమ్మినందువల్లే తన ఆరోగ్యం చెడిపోయిందని, పరిహారంగా ఆ సూపర్మార్కెట్ యజమాన్యంపై దావా వేయబోతున్నట్లు ఆమె ప్రకటించింది.
అవన్నీ ఆరోపణలే:
రజ్వీర్కౌర్ చెప్తున్నవన్నీ అసత్యాలేనని వూల్వర్త్స్ సూపర్మార్కెట్ అధికారప్రతినిధి ఒకరు ఖండించారు. గతేడాది ఈ సంఘటన తర్వాత చట్టపరంగా జరిగిన విచా రణ సమయంలో అధికారులకు ఇదే విషయాన్ని తెలియజేసారు. వూల్వర్త్స్ సూపర్మార్కెట్లోనే రజ్వీర్ కౌర్ తల్లి పుట్టగొడుగులు అమ్మినట్లు ఆధారలేవీ విచారణా ధికారులకు లభించలేదు. పుట్టగొడుగులు కొనుగోలు చేసిన పదిహేనురోజుల తర్వాత రజ్వీర్కౌర్ తల్లి వాటిని వండిందని తెలుస్తోంది. కాగా, అదే సూపర్మార్కెట్లో పుట్టగొడుగులు కొన్నట్లు రసీదులు కూడా వారిదగ్గర లేవు.
పోరాటం కోసం ఆ దేశంలోనే ఉంటా:రజ్వీర్కౌర్
ఇప్పుడిప్పుడే ఆరోగ్యం కుదుటపడిన రజ్వీర్కౌర్ సూపర్మార్కెట్పై న్యాయపోరాటం చేస్తానంటూ నడుం బిగించింది. అయితే, వీసాగడువు ముగియడంతో అనివార్యంగా ఆమె ఇండియాకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తానిక్కడే ఆరోగ్యాన్ని కోల్పోయానని, ఇక్కడి ఆస్పత్రుల్లోనే అవసరమైన చికిత్స పొందుతున్నానని పేర్కొంటున్న రజ్వీర్కౌర్ తాను ఇండియా వెళ్లేందుకు ససేమిరా అంటోంది. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగబోతోందో వేచి చూడాల్సిందే.