Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 300మంది మృతి
సనా:యెమెన్లో హౌతీ తీవ్రవాదులే లక్ష్యంగా వరుసగా రెండురోజులపాటు జరిగిన దాడుల్లో 300మంది మృతి చెందారు. చనిపోయినవారిలో అమాయకులే అధిక సంఖ్యలో ఉన్నారు. సోమవారం వైమానిక దాడులతో సౌదీ సంకీర్ణ సేనలు విరుచుకుపడటంతో 200మందికిపైగా మృత్యువాత పడ్డారు. అది మరువకముందే మంగళవారం రాజధాని సనాలో రెండు కారు బాంబులు పేలి 100మంది వరకూ మృతి చెందారు. ఓ కారు బాంబు హాస్పటల్ సమీపంలో పేలడంతో అక్కడ చికిత్స పొందుతున్న బాధితులు పదుల సంఖ్యలో చనిపోయినట్టు హౌతీ తీవ్రవాదుల పత్రిక పేర్కొంది. హాస్పటల్ను హౌతీ తీవ్రవాదులే నడుపుతున్నారు. యెమెన్ దక్షిణ ప్రాంతంలోని అల్-బారుదాలో జరిగిన మరో కారు బాంబు పేలుడు ఘటనలో పది మంది మృతి చెందారు.ఈ రెండు కారు బాంబు ఘటనలకూ తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్రవాదులు ప్రకటించారు. షియా వర్గానికి చెందిన హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న సనాపై సున్నీ వర్గానికి చెందిన ఐఎస్ ఉగ్రవాదులు ప్రతీకారంతోనే ఈ దాడికి పాల్పడ్డారు. యెమెన్లో సున్నీల నేతృత్వంలోని ప్రభుత్వం తరపున సౌదీ అరేబియా దాడులకు పాల్పడుతుండగా, హౌతీ తీవ్రవాదులు షియాల తరపున పోరాడుతున్నారు. అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని హౌతీ చెబుతోంది. హౌతీ తీవ్రవాదులకు ఇరాన్ మద్దతు తెలుపుతోంది. గత మూడు నెలలుగా ఇరు పక్షాల మధ్య దాడుల్లో కనీసం మూడువేలమంది మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది.