Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డమాస్కస్: అంతర్యుద్ధం వల్ల నలభై లక్షలమంది సిరియా ప్రజలు శరణార్థులుగా మారారని ఐక్యరాజ్యసమితి రెఫ్యూజీ ఏజెన్సీ తెలిపింది. ఇది ఆ దేశ జనాభాలో ఆరో వంతు. బాధితులు పొరుగున ఉన్న టర్కీ ,లెబనాన్, ఇరాక్,జోర్డాన్, ఈజిప్ట్తోపాటు ఉత్తర ఆఫ్రికా దేశాలకు వలస పోతున్నట్టు ఏజెన్సీ పేర్కొంది.
పొరుగు దేశాలకు వెళ్లేవారేకాక దాదాపు 76 లక్షలమంది తమ సొంత ప్రాంతాలను విడిచి సురక్షితమని భావించిన దేశంలోని ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్టు యుఎన్ నివేదికలో వెల్లడైంది. గత రెండున్నర దశాబ్దాల్లో ఇంత పెద్ద సంఖ్యలో శరణార్థులుగా మారిన దేశం మరొకటి లేదని నివేదిక పేర్కొంది.
ఐదేళ్లుగా జరుగుతున్న సిరియా అంతర్యుద్ధంలో 2 లక్షల 20 వేలమంది మృతి చెందారు. శరణార్థుల్లో ఎక్కువ భాగం అధ్వాన్న పరిస్థితుల్లో పేదరికంలో మగ్గుతున్నారని నివేదిక తెలిపింది.
ఓ తరం చిన్నారులు విద్యకు దూరమవుతున్నారని నివేదిక పేర్కొంది. సిరియా శరణార్థుల్లో అధిక భాగం టర్కీలో తలదాచుకుంటున్నట్టు నివేదిక తెలిపింది. టర్కీలో 18 లక్షలు, లెబనాన్లో 12 లక్షలు, జోర్డాన్లో 6 లక్షల 29 వేలు, ఇరాక్లో 2 లక్షల 50 వేలు, ఈజిప్ట్లో లక్షా 32 వేలమంది సిరియా శరణార్థులున్నట్టు నివేదిక తెలిపింది.