Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉ.కొరియా వివాదంపై పుతిన్
- ఆయుధ, సైనిక బలంతో పరిష్కరించలేం
వ్లాడివోస్తోక్ (రష్యా) : దౌత్యమార్గంలో ఉ.కొరియా వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, ఆయుధాలు, సైనిక బలంతో అమెరికా బెదిరిస్తున్నదని రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శించారు. గురువారం వ్లాడివోస్తోక్లో జరిగిన ఆర్థిక మండలి (ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం) సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ...''కొరియా ద్వీపకల్పంలో అశాంతి, అస్థిరత రాకూడదనే కోరుకుందాం. అందునా...ఆయుధ, సైనిక బలప్రదర్శనతో విపత్తును తెచ్చిపెట్టుకోకూడదు. ఉత్తర కొరియా వివాదాన్ని దౌత్య మార్గంలో పరిష్కరించుకోవచ్చు. ఇందుకోసం మనమంతా కలిసి పనిచేయాల్సిన అవసరముంది. ఈ ప్రయత్నం తప్ప కుండా ఫలితాన్ని ఇస్తుంది'' అని అన్నారు. ఆర్థిక మండలి సమావేశానికి జపాన్ ప్రధాని షింజో అబే, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ తదితరులు హాజరయ్యారు. ఉ.కొరియా అంశంపై వీరితో పుతిన్ ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. ఉ.కొరియా ఆర్థిక సంబంధాల ప్రతినిధిగా కిమ్ యాంగ్ జే హాజరయ్యారు. సదస్సులో ఆయన ఏమన్నారంటే...''అమెరికా, దాని మిత్ర దేశాలు చాలా అన్యాయంగా, అనాగరికంగా వ్యవహరిస్తున్నాయి. ఆంక్షలతో, ఆయుధ బలంతో భయపెట్టాలని చూస్తున్నారు. అది పెద్ద తప్పు'' అని అన్నారు.
2005లో సమస్యను
పరిష్కరించే ప్రయత్నం చేశాం
ఉ.కొరియా అణు కార్యక్రమాన్ని వదులుకోవటంపై 2005లో గట్టి ప్రయత్నం జరిగిందన్న విషయాన్ని పుతిన్ ఆర్థిక మండలి సమావేశంలో గుర్తుచేశారు. ఉభయ కొరియా దేశాలు, రష్యా త్రైపాక్షిక సమావేశాలు దాదాపు ఫలించే దశకు చేరుకున్నాయని, అణు, క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయడానికి ఆనాడు ఉ.కొరియా అంగీకరించిందని పుతిన్ తెలియజేశారు. ఉభయ కొరియా దేశాల మధ్య సన్నిహిత సంబంధాలకు ఇదెంతగానో దోహదం చేస్తుందని అందరమూ భావించామని, కానీ ఉ.కొరియా నుంచి ఇంకా ఏదో ఏదో కావాలన్న డిమాండ్లు వచ్చాయి, దీంతో వివాదం మళ్లీ మొదటికొచ్చిందని పుతిన్ గుర్తుచేశారు.