Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుఫాను తీవ్రత ఎక్కువగా ఉందన్న అమెరికా ఫెడరల్ ఏజెన్సీ
- కరీబియన్ దేశాల్లో 12 లక్షల మందిపై ప్రభావం
వాషింగ్టన్ : కరీబియన్ దీవుల్లో పెను బీభత్సం సృష్టించిన ఇర్మా క్రమంగా...అమెరికాలోని ఫ్లోరిడా వైపునకు కదులుతోంది. ఫ్లోరిడా పక్కనున్న రాష్ట్రాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని, కొన్ని రోజుల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవచ్చునని, దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరముందని 'అమెరికా ఫెడరల్ ఎమర్జెన్సీ ఏజెన్సీ' ఆందోళన వ్యక్తం చేసింది.
'ఇర్మా' తుఫాన్పై నాలుగో కేటగిరి ప్రమాద హెచ్చరికను అమెరికా అధికారులు జారీ చేశారు. తుఫాన్ పెద్ద మొత్తంలో నష్టాన్ని చేకూర్చవచ్చునని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతంలోని దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాల్సిందిగా అధికారులు ప్రకటనలు చేశారు. ఆదివారం తెల్లవారుజామున ఇది దక్షిణ ఫ్లోరిడాను చుట్టుముట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
కరీబియన్ దీవుల్లో 14కు చేరిన మృతుల సంఖ్య
ఆంటిగ్వా, బార్బుడా, సెయింట్ మార్టిన్, ప్యూర్టోరికా దీవుల్లో ఇర్మా ప్రభావం ఎక్కువగా ఉంది. గంటకు 285 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీస్తుండటంతో విద్యుత్, సమాచార, రవాణా వ్యవస్థలు కుప్పకూలాయి. సెయింట్ మార్టిన్ ద్వీపంలో 95 శాతం ఇండ్లు ధ్వంసమయ్యాయి. 25 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. తుఫాన్ కారణంగా కరేబియన్ దీవుల్లో ఇప్పటివరకు 14 మంది చనిపోయారు.అట్లాంటిక్ మహాసముద్రం నుంచి జనించిన తుఫాన్లలో 'ఇర్మా' అతి పెద్దదని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. 12లక్షల మంది ప్రజలపై ఈ తుఫాన్ ప్రభావం చూపించనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సంఖ్య 2.6కోట్లకు పెరిగే ప్రమాదం ఉందని రెడ్క్రాస్ హెచ్చరించింది. మరోవైపు ఇర్మా చురుగ్గా కదులుతుండటంతో ఫ్లోరిడాకు తీవ్ర ముప్పు వాటిల్లనుంది. దీంతో ఫ్లోరిడా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ప్రభుత్వం.. పలు ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయించింది.