Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐరాసలో అమెరికా తీర్మానంపై ఉ.కొరియా ఆగ్రహం
ప్యాంగ్యాంగ్ : తమ దేశంపై మరిన్ని ఆంక్షలు విధించేలా ఒత్తిడి తెస్తున్న అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటుందని, దీనికి ప్రతిగా తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తరకొరియా సోమవారం హెచ్చరించింది. అత్యంత శక్తిమంతమైన హైడ్రోజన్ బాంబు పరీక్ష అనంతరం అంతర్జాతీయ సమాజం నుంచి ఉత్తరకొరియాపై ఒత్తిడి పెరిగిన విషయం తెలిసిందే. ఉత్తరకొరియాకు చమురు, టెక్స్టైల్స్ దిగుమతులు నిలిపేయాలని, కిమ్ జోంగ్ ఉన్పై ట్రావెల్ బ్యాన్ విధించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉ.కొరియా ప్రభుత్వ ఆస్తులను స్తంభింపజేయాలని ఐక్యరాజ్యసమితి ముందు అమెరికా ముసాయిదా పత్రాన్ని ఉంచింది. దీనిపై సోమవారంనాడు ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్ జరగనున్నది. ఆత్మరక్షణలో పడ్డ అమెరికా ఐరాసలో తమ దేశానికి వ్యతిరేకంగా ఒత్తిడి తెస్తోందని ఉత్తరకొరియా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకవేళ ఐరాస కఠిన నిర్ణయాలు తీసుకుంటే అందుకు తగిన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తరకొరియా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఓ ప్రకటన జారీ చేసింది. ఉ.కొరియా అణు కార్యక్రమాన్ని దెబ్బకొట్టడానికి అమెరికా రక్తదాహంతో ఉన్నదని, తమ దేశం గురించి అమెరికా ఇంతదాకా క్రూరమైన కలలు కన్నదని, అవన్నీ నెరవేరే అవకాశమే లేదని తెలిసి, తమ దేశాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలు మొదలెట్టిందని ఉ.కొరియా మండిపడింది.