Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పటివరకూ ఆశ్రయం కల్పిస్తాం : బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
ఢాకా : తమ దేశ సరిహద్దుల్లో తలదాచుకున్న రోహింగ్యా శరణార్థులను మయన్మార్ సర్కార్ తిరిగి వెనెక్కి తీసుకుపోవాలని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా డిమాండ్ చేశారు. వివిధ దేశాల ప్రతినిధులతో మంగళవారంనాడు ఆమె బంగ్లా సరిహద్దులోని శరణార్థుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...''సమస్యను మానవతా దృక్పథంతో చూడాలి. అమాయక పౌరులే ఇందులో బలవుతున్నారు. మహిళలు, చిన్నారులు తీవ్రంగా బాధపడుతున్నారు. వీరంతా మయన్మార్ పౌరులే. వందల సంవత్సరాలుగా వారు అక్కడే జీవిస్తున్నారు. అలాంటి నేపథ్యమున్నవారిని తమ దేశ పౌరులు కాదని మయన్మార్ అనటం ఎంతవరకు న్యాయం ? శరణార్థులుగా తమ దేశానికి వచ్చిన వీరికి ఆశ్రయం కల్పిస్తాం. కానీ వీరిని మయన్మార్ తిరిగి వెనక్కి తీసుకెళ్లిపోవాలి.'' అని అన్నారు. హింస చెలరేగడం వెనుక రోహింగ్యా ముస్లిం ఉగ్రవాద సంస్థ పాత్ర ఉందన్న వాదనను ఆమె కొట్టిపారేశారు. సమస్యను ఎంతో సహనంతో మయన్మార్ సర్కార్ పరిష్కరించే ప్రయత్నం చేసి ఉండాల్సిందని ఆమె అన్నారు. 3లక్షలకుపైగా రోహింగ్యా ముస్లిం శరణార్థులు ఇప్పుడు బంగ్లా సరిహద్దుల్లో తలదాచుకున్నారు. వీరికి ఆశ్రయం కల్పించటంపై, మయన్మార్పై ఒత్తిడి తీసుకురావటం కోసం బంగ్లాదేశ్ అంతర్జాతీయ సాయం కోరింది. దీనిపై బంగ్లాదేశ్ పార్లమెంట్ ఒక తీర్మానం కూడా చేసింది. సమస్య తీవ్రతను తెలియజేయడానికి వివిధ దేశాల ప్రతినిధులను తీసుకొని షేక్ హసీనా మంగళవారంనాడు సరిహద్దు ప్రాంతాల్ని సందర్శించారు.