Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతి, అక్రమాలకు పాల్పడ్డవారిని రక్షించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
టునిస్ : అవినీతి, అక్రమాలకు పాల్పడినవారిని కోర్టు ముంగిట నిలబెట్టి, శిక్ష విధించేది చట్టం. ఈ చట్టాలను రూపొందించేది పార్లమెంట్. అందుకే దీనిని చట్టసభ అంటారు. ట్యునీషియా పార్లమెంట్ దీనికి విరుద్ధంగా వ్యవహరించింది. బెన్ అలీ ఆ దేశ అధ్యక్షుడిగా (1987-2011) ఉన్న కాలంలో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిని శిక్షల నుంచి బయటపడేసేందుకు ప్రస్తుత పార్లమెంట్ ఓ వివాదాస్పద చట్టాన్ని చేసింది. అధికార పార్టీ ప్రవేశపెట్టిన ఈ వివాదాస్పద బిల్లును ట్యునీషియా పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. ఈ వివాదాస్పద బిల్లును ఆమోదించకూడదని పార్లమెంట్ బయట, దేశవ్యాప్తంగా పలు చోట్ల ఓ వైపు పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నా అధికార పార్టీ, ప్రభుత్వం పట్టించుకోలేదు. అధికార పార్టీలైన ఎన్నాహ్దా, నిదా ఈ వివాదాస్పద బిల్లును తెరమీదకు తీసుకొచ్చి పార్లమెంట్లో ఆమోదింపజేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఎస్సెబ్సీ, అధికార పార్టీలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బెన్ అలీ పాలనలో చోటు చేసుకున్న అవినీతి, ఆక్రమాలకు వ్యతిరేకంగా ఆనాడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. దీంతో అధ్యక్షుడు బెన్ అలీ దేశం విడిచిపోవాల్సి వచ్చింది. ఆనాడు అధ్యక్షుడుకు వ్యతిరేకంగా, ఆయన అవినీతి, ప్రభుత్వ వర్గాలకు వ్యతిరేకంగా ట్యునీషియాలో విప్లవం తలెత్తింది. ఆనాటి అక్రమార్కులను రక్షించడమేంటి ? దానికోసం ఓ చట్టాన్ని తీసుకురావటం ఏంటి ? అని ప్రతిపక్ష పార్టీల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. అయితే అధికార పార్టీల (ఎన్నాహ్దా, నిదా) వాదన మరోలా ఉంది. ''ట్యునీషియా గత పాలనను మరిచిపోదాం. దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం తీసుకురావాలి. అధికారుల్లో, పాలనా వర్గాల్లో ఆత్మవిశ్వాసం తీసుకురావాలి. ఇందుకోసమే ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చాం. ఒక కొత్త ట్యునీషియా నిర్మాణం కోసం ఈ చట్టాన్ని అధ్యక్షుడు ఎస్సెబ్సీ తీసుకొచ్చారు'' అని అధికార పార్టీ నాయకులు సమర్థించుకుంటున్నారు. దేశంలోని బడా వ్యాపారవేత్తల్ని, ఉన్నతస్థాయి అధికార వర్గాన్ని కేసుల నుంచి రక్షించడానికి అధ్యక్షుడు స్వయంగా ఈ బిల్లును రూపొందించినట్టు వార్తలు వెలువడ్డాయి.