Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 25 మంది సజీవ దహనం
- అగ్నికి ఆహుతైన విద్యార్థులు, టీచర్లు
కౌలాలంపూర్: మలేషియా రాజధాని కౌలాలంపూర్లో గురువారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనమయ్యారు. బోర్డింగ్ పాఠశాల దారుల్ ఖురాన్ ఇత్తిఫాకియా స్కూల్లో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు మలేసియా ఫైర్ అండ్ రెస్క్యూ విభాగం వెల్లడించింది. మృతుల్లో 23 మంది విద్యార్దులు, ఇద్దరు టీచర్లు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. గాయపడిన మరో ఏడుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. చనిపోయిన పిల్లలంతా 13 నుంచి 17 ఏండ్ల లోపువారే ఉన్నారని తెలిపింది. ఈ ఘటనపై ప్రధాని నజీబ్ రజాక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. ''గదుల తలుపులకు మంటలు అంటుకోవడంతో విద్యార్థులు బయటికి రాలేకపోయారు. వసతి గృహంలో కిటికీలన్నిటికీ ఇనుపచువ్వలు పెట్టి ఉండడంతో బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరి ఆడక విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి'' అని కౌలాలంపూర్ పోలీస్ చీఫ్ అమర్ సింగ్ తెలిపారు. 14 మంది విద్యార్థులను, నలుగురు ఉపాధ్యాయులను కాపాడగా వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సింగ్ వెల్లడించారు.
కాపాడమని చిన్నారులు హాహాకారాలు
''పెద్ద పెద్ద శబ్దాలు విని మొదట ఉరుములు వస్తున్నాయేమోనని అనుకున్నాను. కానీ అవి చిన్నారుల హాహాకారాలు అని అర్థమయ్యింది. అగ్నికీలల్లో చిక్కుకున్న చిన్నారులు కాపాడండి అంటూ కిటికీల దగ్గర నిలబడి వేడుకున్నారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. వారికి సహాయం చేయలేకపోయాం. చిన్నారులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు'' అని అగ్నిప్రమాదానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన అరిఫ్ మవార్డీ చెప్పుకొచ్చాడు. ఆ భవనంలోనే కింది అంతస్తులో ఉంటున్న అతడు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్నాడు.
''సహాయం కోసం ఏడుస్తూ చిన్నారుల చేతులు పాఠశాల భవనంలోని గ్రిల్స్లో నుంచి బయటికి కనిపించాయి. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. అగ్నికీలలు భయంకరంగా ఎగిసిపడుతుండటంతో సహాయం చేయలేకపోయాం'' అని అక్కడి స్థానికురాలు భయానక ఘటన గురించి వివరించారు.