Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 ఏండ్లుగా అంతరిక్షంలో ప్రయాణం
నాసా : శనిగ్రహం గురించి తెలుసుకోవడానికి 'నాసా' పంపిన 'కాస్సిని' అంతరిక్ష నౌకా యాత్ర నేటితో ముగిసింది. శుక్రవారం (బ్రిటన్ కాలమానం ప్రకారం 12.55)నాడు ఈ నౌక శనిగ్రహ వాతావరణంలోకి కుప్పకూలనున్నది. 1997లో నాసా, యూరోపియన్ స్పేస్, ఇటాలియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా 'కాస్సిని' శాటిలైట్ను అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఇన్నేండ్ల ప్రయాణంలో శనిగ్రహం వలయాలు, చంద్రుడు 'టైటాన్', సౌర కుటుంబం గురించి విలువైన చిత్రపటాల్ని, ఇతర సమాచారాన్ని 'కాస్సిని' భూమికి పంపింది. రిమోట్ నియంత్రణలో నడిచే రోబో తరహా శాటిలైట్ ఇది. కాస్సినిలో ఉన్న ఇంధనం నేటితో అయిపోవటంతో, దీనిని ఇక కూల్చేయాలని నాసా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిగ్రహం పరిసరాల్లోకి మానవుడు పంపిన మొట్టమొదటి శాటిలైట్ 'కాస్సిని'. అంతరిక్ష శోధనలో అత్యంత సుదూరంలోకి ఎలాంటి ఆటంకం లేకుండా చేరుకోవటం, శాస్త్రవేత్తలు అంచనా వేసినట్టుగా శనిగ్రహం చుట్టూ తిరుగుతూ పలు విషయాల్ని భూమికి పంపటం ఓ అద్భుతం. ఈ శాటిలైట్ గత 20 ఏండ్లుగా అంతరిక్షంలో ఉండటం, ఇందులో 13 ఏండ్ల ప్రయాణం శనిగ్రహం కోసం ప్రయాణించటం మరో అద్భుతం. శనిగ్రహం వాతావరణంలోకి కుప్పకూలిన అనంతరం, 930 మైళ్ల ఎత్తులో శనిగ్రహం వాతావరణంలో ఉండగానే కాస్సిని దహనమైపోతుంది. ఇదంతా రెండు నిమిషాల్లో జరిగిపోతుందని శాస్త్రవేత్తలు తెలియజేశారు.
- ఈ శాటిలైట్ అసలు పేరు 'కాస్సిని-హైజెన్స్'. సౌర కుటుంబం ఎలా ఏర్పడింది ? శనిగ్రహం వలయాలు, చంద్రడు టైటాన్ ఉపరితలం...తదితర విషయాలపై పరిశోధన నిమిత్తం దీనిని పంపారు.
- కాస్సినితోపాటు ఉన్న హైజెన్స్ అనే శాటిలైట్ కూడా ఇందులో ఉంది. భూమి, శుక్రుడు, గురు గ్రహాల గురుత్వాకర్షణలను దాటుకొని 2004లో శనిగ్రహం కక్షలోకి 'కాస్సిని-హైజెన్స్' శాటిలైట్ చేరుకుంది.
- హైజెన్స్ ప్రయాణం 2005లో ముగిసింది. ఈ మొత్తం ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా దాదాపు 25 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు.
- సెప్టెంబర్ 15, 2017...అంటే నేటితో కాస్సిని శాటిలైట్లో ఇంధనం అయిపోతుంది. ఇప్పుడు దీనిని ఓ పద్ధతి ప్రకారం నాసా శాస్త్రవేత్తలు కూల్చేయాలి. లేదంటే ఆ శాటిలైట్పై నాసా నియంత్రణ కోల్పోతుంది. అప్పుడు దాని ఇష్టానుసారం సౌర కుటుంబంలో తిరిగే అవకాశం ఏర్పడుతుంది.
- ఈ పరిణామాన్ని తప్పించడానికి 'నాసా' శాస్త్రవేత్తలు ఈరోజు 'కాస్సిని'కి గుడ్ బై చెబుతున్నారు. ఈ ప్రక్రియ అంతా రెండు నిమిషాల్లో ముగుస్తుంది. శనిగ్రహం వాతావరణంలోకి వెళ్లాక ముక్కలుముక్కలుగా చీలిపోయి దహనమైపోతుంది. కాస్సిని చివరి సిగల్స్ భూమికి చేరడానికి 83 నిమిషాలు పడుతుంది.