Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్య పరిష్కారం కోసం వాషింగ్టన్ నాయకత్వం చేయాల్సినంత చేయటం లేదు
- చైనా రాయబారి తియాంకి వెల్లడి
వాషింగ్టన్ : ఉ.కొరియాతో నెలకొన్న వివాద పరిష్కారం కోసం అమెరికా ఎంచుకున్న మార్గం సరైంది కాదని చైనా మరోమారు హెచ్చరించింది. ఆ దేశానికి బెదిరింపులు చేయటం మాని...వెంటనే చర్చల ప్రక్రియను ఎంచుకోవాలని హితవు పలికింది. చర్చలు, సంప్రదింపుల కోసం అమెరికా చేయాల్సింది ఎంతో ఉందని చైనా రాయబారి కూ తియాంకి శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
''నిజాయితీగా చెప్పాలంటే...వివాద పరి ష్కారం కోసం వాషింగ్టన్ నాయకత్వం చేయాల్సినంత చేయటం లేదు. చర్చల ప్రక్రియకు అడ్డుగా ఉన్నవాటిని తొలగించే ప్రయత్నం అమెరికా చేయాలి. అప్పుడు అంతర్జాతీయ సహకారం కూడా తోడవుతుంది. బెదిరింపుల ధోరణిని పక్కకు పెట్టాలి. చర్చలు, సంప్రదింపుల ప్రక్రియ కోసం మార్గాల్ని వెతకాలి'' అని తియాంకి అభిప్రాయపడ్డారు.
చైనా వాణిజ్యాన్ని అణగదొక్కడానికి ఆంక్షలు విధించే యోచనలో అమెరికా ఉందని జిన్హువా న్యూస్ ఏజెన్సీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఉ.కొరియా మాదిరిగా చైనాపైనా ఒత్తిళ్లు తీసుకొచ్చి, ఆంక్షలు విధించాలని ప్రయత్నిస్తే అందుకు అమెరికన్లే మద్దతు ఇవ్వబోరని ఆయన పేర్కొన్నారు.
ఉ.కొరియా ముప్పును సమర్థంగా ఎదుర్కొంటాం : ట్రంప్
ఉత్తర కొరియా ముప్పును ఎదుర్కొనేందుకు తమ ముందు అనేక ఆప్షన్స్ ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. జపాన్ మీదుగా ఉత్తర కొరియా మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించిన మరుసటి రోజే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్లో జరిగిన అమెరికా వైమానిక దళం 70వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఆయన.. వైమానిక దళ సిబ్బందిని, వారి కుటుంబాలను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా, దాని మిత్ర పక్షాలు ఎప్పటికీ భయ పడ బోవని ట్రంప్ అన్నారు. ఉత్తరకొరియా తాజా క్షిపణి ప్రయోగంపై అమెరికా రక్షణ మంత్రి జెమ్స్ మ్యాటిస్, జపాన్ రక్షణ మంత్రి ఇట్స్నూరీ ఒడెనొరాతో ఫోన్లో మాట్లాడారు. జపాన్ రక్షణకు కట్టుబడి ఉన్నామని భరోసా ఇచ్చారు.