Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : నల్లజాతీయుడ్ని కాల్చి చంపిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పోలీసును నిర్దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు ఇవ్వటంపై సెయింట్ లూయిస్(అమెరికా) నగరంలో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. నల్లజాతీయుడైన ఆంథోనీ లామార్ స్మిత్ (24)పై 2011లో సెయింట్ లూయిస్ నగర పోలీసు జాసన్ స్టాక్లీ (36) తూపాకీ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో స్మిత్ చనిపోయాడు. పోలీస్ అధికారి స్టాక్లీపై ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసు ఫైల్ అయ్యింది. ఈ కేసు విచారణ జరిపిన సర్క్యూట్ జడ్జి స్టాక్లీ నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వెలువరించాడు.
కోర్టు తీర్పును నిరసిస్తూ నగరంలో తాజాగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసన వెల్లువెత్తాయి. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం సాయంత్రం జరిగిన ఆందోళన కార్యక్రమంలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. రబ్బరు బుల్లెట్ల వర్షం కురిపంచారు. దీంతో 100 మందికిపైగా నిరసనకారులు తీవ్ర గాయాలపాలయ్యారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసన ర్యాలీని పోలీసులే హింసాయుతంగా మార్చారని ర్యాలీ నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.