Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊపందుకున్న 'కుర్దిస్తాన్' ఏర్పాటు నినాదం
- ఈనెల 25న రెఫరెండం నిర్వహిస్తామని ప్రకటన
- తీవ్ర పరిణామాలుంటాయని ఇరాక్ ప్రభుత్వం హెచ్చరిక
బాగ్దాద్ : ఇరాక్ నుంచి విడిపోయి...స్వతంత్ర రాజ్యంగా 'కుర్దిస్తాన్' ఏర్పాటుచేయాలన్న నినాదం బలం పుంజుకుంటోంది. ఇరాక్ ఉత్తరభాగంలో 'ఇర్బిల్' కేంద్రంగా కుర్దిస్థాన్ రీజినల్ గవర్నమెంట్ (సెమీ అటానమస్) పాలిస్తున్నది. ఇర్బిల్. దహుక్, ఇబ్రిల్, సులేమానియా ఫ్రావిన్సుల్లో ఈనెల 25వ తేదీన రెఫరెండం నిర్వహిస్తున్నామని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. దీనిని ఎంతమాత్రమూ అంగీకరించమని ఇరాక్ ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. కుర్దిస్తాన్ ఏర్పాటుచేయటమంటే...'రెండో ఇజ్రాయిల్' అవుతుందని, రాజధాని ఇర్బిల్లో వేయిమంది కుర్దులు ప్రదర్శన చేస్తే ప్రత్యేకదేశాన్ని ఇచ్చేస్తామా ? అంటూ బాగ్దాద్ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కుర్దిస్థాన్ ఏర్పాటును తామెంతమాత్రమూ అంగీకరించేది లేదని, రెఫరెండంను అనుమతించమని ఇరాక్ ఉపాధ్యక్షుడు నౌరీ అల్ మాలికీ మీడియాకు తెలియజేశారు. రెఫరెండం నిర్వహించాలన్న నిర్ణయాన్ని కుర్దిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఇరాక్ సాధారణ ప్రజల ప్రయోజనాల్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆయన అన్నారు. దీనికంటే ముందు ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాదీ కూడా రెఫరెండం నిర్వహణపై హెచ్చరికలు జారీ చేశారు. ఇది నిప్పుతో చెలగాటమేనని, ఇర్బిల్పై సైనికచర్యకు వెనుకాడమని ఆయన అన్నారు.
కుర్దిస్తాన్ ఉద్యమం నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో తమప్రయోజనాలు ఎక్కడ దెబ్బతింటాయోనన్న ఆందోళనలో అమెరికా ఉంది. కుర్దిస్తాన్ ప్రజలు తమ ఆకాంక్షను శాంతియుత పద్ధతుల్లో వ్యక్తం చేయాలని రష్యా స్పందించింది. టర్కీ, సిరియా, ఇరాక్, ఇరాన్ దేశాలతో కూడా ముడిపడి ఉన్న సమస్య కాబట్టి, అంతర్జాతీయ చట్టాల ప్రకారం కుర్దుల ఆకాంక్షలు నెరవేరాలని రష్యా విదేశాంగ మంత్రి లావరోవ్ చెప్పారు.
ఇదీ నేపథ్యం...
సొంతంగా దేశమంటూ లేని అతిపెద్ద జాతిగా కుర్దులకు గుర్తింపు ఉంది. ఇరాక్కు ఉత్తరాన ఉండే కుర్దిస్థాన్, టర్కీకి ఆగేయాన, సిరియాకు ఉత్తరాన, వాయువ్య ఇరాన్లలో వీరు నివసిస్తున్నారు. మొత్తం 5 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన భూభాగంలో (ఇది నాలుగు దేశాల్లో విస్తరించి ఉంది) కుర్దులు ఉన్నారు. కుర్దీ భాష, ఆచార వ్యవహారాల్లో సారూప్యత కారణంగా తామంతా ఒక్క జాతేననే భావన కుర్దీల్లో బలపడింది. స్వతంత్య్రదేశం కావాలనే డిమాండ్ దాదాపు వందేండ్లుగా ఉంది. ఇరాక్లోని కుర్దిస్థాన్లో 53 లక్షల మంది నివసిస్తున్నారు. టర్కీలో కోటిన్నర మంది కుర్దులు ఉన్నారు. సిరియాలో 20 లక్షల దాకా ఉంటారు. ఇరాన్లో వీరి జనాభా 80 లక్షల దాకా ఉంటుంది.
- టర్కీలో నివసించే కుర్దుల కోసం ప్రత్యేక రాజ్యం కావాలనే డిమాండ్తో 1978లో కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ (పీకేకే) ప్రారంభమైంది. 1984లో పీకేకే సాయుధపోరాట మార్గాన్ని ఎంచుకుంది.
- కుర్దుల స్వరాజ్యకాంక్ష 1991లో కువైట్ యుద్ధంలో ఇరాక్ ఓటమితో మళ్లీ బలపడింది. కుర్దుల ఆర్మీ 'పెష్మెర్గా' బలపడింది.
- ప్రత్యేక రాజ్యం కోసం ఈనెల 25న రిఫరెండం నిర్వహించాలని కుర్దిస్థాన్ పార్లమెంటు తీర్మానించడంతో పొరుగుదేశాలు ఉలిక్కిపడ్డాయి. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాయి.
- తమ దేశాల్లోని కుర్దులు కూడా ఇరాక్లోని కురిస్థాన్తో కలిసిపోతామనే డిమాండ్లతో ఉద్యమాలకు దిగుతారని టర్కీ, ఇరాన్, సిరియాల భయం. తమ దేశంలో ఇదే డిమాండ్లతో సాయుధ పోరు చేస్తున్న సంస్థలకు పెష్మెర్గా అండ తోడైతే... అశాంతి తలెత్తుతుందని, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలుగుతుందని టర్కీ, ఇరాన్ భావిస్తున్నాయి.