Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 250కి చేరిన భూకంప మృతులు
- శిథిలాల కింద మరెందరో... పెరుగుతున్న మృతుల సంఖ్య
- కొనసాగుతున్న సహాయక చర్యలు
మెక్సికో: మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.1గా నమోదైందని యూఎస్ జియోలజికల్ సర్వే అధికారులు తెలిపారు. మెక్సికో నగరం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్యూబ్లా రాష్ట్రంలోని రబోసో నగర సమీపంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు తెలిపారు. ఈ ప్రకృతి విలయంతో 250 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది గల్లంతయ్యారు. శిథిలాలమైన భవనాల కింద మరికొందరు చిక్కుకుని ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అన్నారు. భూకంపం సంభవించడంతో 20లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్, రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం సెంట్రల్ మెక్సికోలో సంభవించిన ఈ భూకంపం దాటికి భారీ భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. దీంతో, ప్రజలు ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. మెక్సికో గవర్నర్ అల్ఫ్రెడో డెల్ మేజో మజా సహాయక చర్యలను పర్యవేక్షించారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా, ఈనెల 7న మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్స్కేల్పై దీని తీవ్రత 8.1గా నమోదైంది. ఈ దుర్ఘటనలో 90 మంది మృతి చెందారు. మెక్సికోలో 1985లో భారీ భూకంపం సంభవించింది. 1985, సెప్టెంబర్19న మెక్సికోలో భూకంపం సంభవించింది. ఈ ప్రకృతి విపత్తులో 10వేల మంది మృతి చెందారు. 30వేల మంది తీవ్రంగా గాయపడ్డారు. 4వేల భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ సందర్భంగా అప్పటి భూకంప ప్రమాదంలో చనిపోయిన వారికి నివాళులర్పిస్తూ మంగళవారం మెక్సికో ప్రజలు మాక్డ్రిల్స్ కూడా నిర్వహించారు. కానీ అదే రోజు మళ్లీ భూకంపం సంభవించడం దురదృష్టకరం.
భూకంప సమయాల్లో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యలు, దాని ప్రభావం బారినపడకుండా ఉండాలంటే చేయాల్సిన పనులను గుర్తు చేస్తూ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సైరన్లు మోగించగానే వీధుల్లోకి సిబ్బంది, వాలంటీర్లు వచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. వీటిని చూసిన ప్రజలు గతం ఆలోచనల నుంచి పూర్తిగా బయటకు రాకముందే మరోసారి భూకంపాన్ని సూచిస్తూ, హెచ్చరికగా సైరన్లు మోగాయి. వాటిని మాక్ డ్రిల్ సైరన్లుగా భావించిన ప్రజలు ఇండ్లలోనే ఉండిపోయారు. దీంతో, చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు అప్రమత్తమయ్యేలోపే భవనాలు పేకమేడల్లా వారిపై కూలిపోయాయి. దీంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది.
పేకమేడల్లా కుప్పకూలిన భవనాలు..!
ఓ వైపు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్న శిథిలాలు.. మరోవైపు తమ కుటుంబసభ్యులు కనిపించడం లేదంటూ ప్రజల హాహాకారాలు. తమ ఆత్మీయులు అసలు బతికి ఉన్నారో లేదో తెలియని ఆందోళనతో మెక్సికో వాసులు బిక్కు బిక్కున గడుపుతున్నారు.
డజన్ల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఓ ప్రాంతంలోని భవనం హఠాత్తుగా కూలిపోయి శిథిలాలతో నిండిపోయింది. దుమ్ము, ధూళి ఆ ప్రాంతాన్ని ఆవరించింది. 'నా జీవితంలో ఇటువంటి భూకంపాన్ని చూడలేదు.. మా అపార్ట్మెంట్ మొత్తం కుప్పకూలిపోయింది. ఆ ప్రాంతమంతా రక్తంతో తడిసిపోయింది. .' అని ఓ ప్రత్యక్ష సాక్షి తన భయానక అనుభవాన్ని చెప్పుకొచ్చింది. 'మేము కూర్చున్న స్థలం ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. చాలా భయపడిపోయాము. ప్రజలందరూ కార్యాలయాల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.' అని మరో ప్రత్యక్ష సాక్షి జీవెన్ మింటో వివరించారు. భూకంపం ధాటికి రోడ్లు బీటలు వారి కుంగిపోయాయి. భూకంపం మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, కోస్టా రికాన్ అధ్యక్షుడు లూయిస్ గిలెర్మా, పోప్ ఫ్రాన్సిస్ తదితరులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కుప్పకూలిన పాఠశాల భవనం..21 మంది చిన్నారులు మృతి
భూకంప ధాటికి మెక్సికోలోని ఓ పాఠశాల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 21 మంది చిన్నారులు మృతి చెందారు. ఎన్రిక్ రెబ్సామెన్ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. భవన శిథిలాల కింద నుంచి సుమారు 22 మృతదేహాలను వెలికి తీసినట్టు ఆదేశాధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో తెలిపారు. మృతుల్లో ఇద్దరు టీచర్లు ఉన్నారు. అయితే శిథిలాల కింద మరో 30 మంది చిన్నారులు, 8 మంది సిబ్బంది చిక్కుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు. సహాయక సిబ్బంది శిథిలాలను తొలిగిస్తున్నారు. మెక్సికో నగరంలో ఓ చర్చి కూలిపోవడంతో 15 మంది మృతి చెందారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.