Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మయన్మార్లో రోహింగ్యాలపై కొనసాగుతున్న హింసాకాండ
నైపేయీ : మయన్మార్లో రోహింగ్యా ముస్లింల పరిస్థితి మెరుగుపడటం లేదు. వారిపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు అందజేస్తున్న సాయాన్ని సైతం అక్కడి కొన్ని గ్రూపులు అడ్డుకుంటున్నాయి. రఖైనే రాష్ట్ర రాజధాని సిట్టివే సముద్ర తీర ప్రాంతానికి గత బుధవారం అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ పంపిన ఓడలు చేరుకున్నాయి.
ఈ ఓడల్లో రోహింగ్యా శరణార్థుల కోసం ఆహార పదార్థాలు, ఇతర వస్తువుల్ని రెడ్ క్రాస్ కార్యకర్తలు తీసుకొచ్చారు.
రఖైనే రాష్ట్రంలో ఈ విషయం తెలుసుకున్న కొన్ని ముఠాలు ఓడలపైకి పెట్రోల్ బాంబులు విసిరి దాడి జరిపారు. భారీ సంఖ్యలో ఉన్న ఈ గ్రూప్ దాడి చేయటంతో ఒక్కసారిగా వాతావరణం ఉద్రిక్తంగా మారింది. 200 మంది పోలీసులు రంగంలోకి దిగి ఓడలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేశారు. గాలిలోకి కాల్పులు జరపటంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని సమాచారం.
మొత్తం ఘటనలో అనేకమందికి తీవ్ర గాయాలు అయినట్టు స్థానిక ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలియజేశారు. లక్షలాది మంది రోహింగ్యా ముస్లింలు ప్రాణాలు అరచేత పట్టుకొని బంగ్లాదేశ్ సరిహద్దుకు పారిపోయారని, మరోవైపు రఖైనే రాష్ట్రంలో ప్రాణ భయంతో కాలం వెళ్లదీస్తున్నవారూ పెద్ద సంఖ్యలో ఉన్నారని, ఆహారం, నీరు లేకుండా వీరంతా భయంతో రోజులు వెళ్లదీస్తున్నారని, వీరిని ఆదుకోవటం కోసం ఓడల్లో ఆహారం, నీరు, ఇతర వస్తువుల్ని తీసుకొచ్చామని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడొకరు తెలిపారు. ''ఇక్కడికి ఎందుకు వచ్చారు ? ఏం తెచ్చారు ? అని ఒక గుంపు ఇనుప రాడ్లు, పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని వచ్చి మమ్మల్ని అడిగారు'' రెడ్ క్రాస్ అధికార ప్రతినిధి మారియా సిసీలియా చెప్పారు.