Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెక్సికో పాఠశాల భవనం వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
మెక్సికో సిటీ : వరుస భూకంపాలు, భీకర తుఫాన్లు... మెక్సికో ప్రజలకు తీరని కష్టాల్ని తెచ్చిపెట్టాయి. మంగళవారంనాటి భూకంపం ధాటికి అక్కడి ప్రజా జీవితం పూర్తిగా స్తంభించి పోయింది. ముఖ్యంగా దేశ రాజధాని మెక్సికో సిటీ పొందిన నష్టం అంతా ఇంతా కాదు. పాఠశాల భవనం కూలిన ఘటనలో సహాయక కార్య క్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. గల్లం తయిన పిల్లల తల్లిదండ్రులు ఎంతో ఆశగా శిథిలాలవైపు, రెస్క్యూలో పాల్గొంటున్న అధికారులవైపు చూస్తున్నారు. ఘటనాస్థలంలో వారి బాధ వర్ణణాతీయంగా ఉంది. శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించటం కోసం రెండోరోజు రాత్రి (బుధవారం) కూడా రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఇప్పటివరకూ 11 మంది చిన్నారులను, ఒక టీచర్ను రక్షించారు. రెస్క్యూ ఆపరేషన్లో 500 మందితో కూడిన ఆర్మీ, నావి సిబ్బంది పనిచేస్తున్నారు. మరోవైపు ఘటనాస్థలంలో 200 మంది పోలీసులు సహాయక కార్యక్రమాలు అందజేస్తున్నారు.
అయితే శిథిలాల కింద ఉన్నవారిని చేరుకోవటం కోసం సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఒక చిన్నారితో సిబ్బంది మాట్లాడటం జరిగింది. ఆ చిన్నారికి సమీపంలోనే మరికొంత మంది పిల్లలు ఉండే అవకాశముందని సిబ్బంది గుర్తించారు. అయితే వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారన్న సంగతి మాత్రం తెలియటం లేదు. వారు ఉన్నచోటకు ఆక్సీజన్, నీటిని పంపారు. సుమారుగా ఐదుగురు చిన్నారులు ప్రాణాలతో ఉన్నట్టు తెలుస్తున్నదని, సిమెంటు దిమ్మెలు అడ్డుగా ఉన్నాయని, వాటిని జాగ్రత్తగా తొలగించాల్సి ఉంటుందని రెస్క్యూ సిబ్బంది ఒకరు 'ఏజెన్సీ ఫ్రాన్స్ ప్రెస్'కు తెలియజేశారు.
మంగళవారంనాటి భూకంపం ధాటికి ఒక్క మెక్సికో సిటీలోనే 39 భవనాలు కుప్పకూలాయి. పాఠశాల భవనం కూలి 21 మంది చిన్నారులు, మరో ఐదుగురు మృతి చెందారని స్థానిక అధికారులు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం 230మందికిపైగా చనిపోయారని అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో తెలిపారు. దేశంలో మూడు రోజులుపాటు సంతాప దినాల్ని ప్రకటించారు.
కూలిన పాఠశాల భవనం వద్ద సహాయక కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న తమ చిన్నారుల్ని ఎలాగైనా రక్షించాలంటూ తల్లిదండ్రులంతా ఘటనాస్థలానికి చేరుకొని అధికారుల్ని వేడుకుంటున్నారు. కొంతమంది మాత్రమే ప్రాణాలతో ఉండొచ్చునని 'సివిల్ ప్రొటెక్షన్ వాలెంటీర్' ఎన్రిక్ గార్డియా తెలిపారు.