Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉ.కొరియాపై చేసిన వ్యాఖ్యలకు తగిన మూల్యం చెల్లించుకుంటాడు...
- మా అణు కార్యక్రమం సరైందేనని అతని మాటలే చెబుతున్నాయి..: ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్
ప్యాంగ్యాంగ్ : అమెరికా, ఉత్తరకొరియా మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది. ట్రంప్ మానసికస్థితి సరిగా లేదని.. తమ దేశాన్ని నాశనం చేస్తామని ట్రంప్ వ్యాఖ్యలు చేయటం పట్ల ఉ.కొరియా అధినేత కిమ్జోంగ్ ఉన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తమ దేశానికి అణ్వాయుధాలు అభివృద్ధి చేసే హక్కు ఉందన్నారు. తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి..కిమ్ జోంగ్ చేసిన ప్రకటనను ఉ.కొరియా అధికారిక మీడియా 'కేసీఎన్ఏ' శుక్రవారం విడుదల చేసింది.
అమెరికా బెదిరింపుల నుంచి తమ దేశాన్ని కచ్చితంగా రక్షించుకుంటామని.. ఇందుకు అణు సంపత్తి అవసరమని కిమ్ పేర్కొన్నారు. అణు పరీక్షలపై తన నిర్ణయాన్ని మార్చుకునే ప్రసక్తే లేదని కిమ్ స్పష్టం చేశారు. ''ట్రంప్ వ్యాఖ్యలు అణు పరీక్షలపై నేను తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకునేలా కాకుండా సమర్థించేలా ఉన్నాయి. నేను ఎంచుకున్న మార్గం సరైనదే. చివరి వరకూ ఆ మార్గాన్నే అనుసరిస్తాను'' అని కిమ్ అన్నారు. ఉత్తరకొరియా ఇటీవల అతిశక్తిమంతమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించిన విషయం తెలిసిందే. అమెరికా లక్ష్యంగా ఈ పరీక్ష చేసినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత జపాన్ మీదుగా పసిఫిక్ మహాసముద్రంలోకి బాలిస్టిక్ క్షిపణిని కూడా ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళతాం...
గతంలో అనేకమార్లు డొనాల్డ్ ట్రంప్ ఉ.కొరియా అధినేతను ఉద్దేశించి వ్యక్తిగత స్థాయిలో విరుచుకుపడ్డాడు. అయితే ఇవేవీ కిమ్ జోంగ్ ఉన్ను కదిలించ లేకపోయాయి. కానీ తన దేశాన్ని నాశనం చేస్తానని ఐరాస వేదికపై బెదిరింపులకు దిగటాన్ని మాత్రం కిమ్ సహించలేకపోయాడు. తొలిసారిగా ఆయన మీడియా ముందుకు వచ్చి వ్యక్తిగతంగా స్పందించాల్సి వచ్చింది. తమ విధానాలు సరైనవేనని లోకానికి చెప్పాలనుకున్నారు. ట్రంప్ మాటలు తనను భయపెట్టలేదని, కనీసం తనను అడ్డుకోలేవని కిమ్ అన్నారు. తానెంచుకున్న మార్గం సరైనదేనని, ఆ మార్గాన్నే చివరి వరకు అనుసరిస్తానని స్పష్టం చేశారు.
తమపై యుద్ధం చేసి నాశనం చేస్తానని ట్రంప్ బెదిరింపులకు దిగాడని, ఆ పిచ్చి మాటలకు ట్రంప్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కిమ్ హెచ్చరించారు. ట్రంప్ ఓ రోగ్.. ఓ గ్యాంగ్స్టర్.. అతను రాజకీయవేత్త కానే కాదని అన్నారు. దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందర్నీ బెదిరిస్తున్నాడని, బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, సుప్రీం కమాండర్గా పనికిరాడని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులతోనే ఆ ముసలి ట్రంప్ తిక్క కుదిరిస్తానని హెచ్చరించారు.
''ఉ.కొరియాను సర్వ నాశనం చేస్తానన్న అమెరికా అధ్యక్షుడు తగిన మూల్యం చెల్లించుకోనేలా చేస్తా. ఐరాస వేదికపై ఒక సార్వభౌమాధికార దేశాన్ని నాశనం చేస్తానని చెప్పటం ద్వారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిచ్చివాడిగా ప్రవర్తించాడు''
- ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్
కఠిన పరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు
ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వ్యాఖ్యలపై ట్రంప్ ట్విట్టర్లో స్పందించారు. ''ఆకలితో అలమటిస్తున్న తన ప్రజల్ని పట్టించుకోని ఉ.కొరియా అధినేత కిమ్ ఓ పిచ్చివాడు. ఇంతకు ముందు ఎదుర్కోని కఠిన పరీక్షకు సిద్ధంగా ఉండు '' అని ట్వీట్ చేశారు.
- కిమ్ ప్రకటనపై ట్రంప్ ట్విట్టర్ సందేశం.