Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యంతర శ్రేణి క్షిపణిని ప్రయోగించాం : ఇరాన్ అధికారులు
టెహ్రాన్ : ఇరాన్ అణు కార్యక్రమంపై ఐక్యరాజ్యసమితిలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఆ దేశం తగినవిధంగా సమాధానమిచ్చింది. ఇరాన్ ఖండాంతర క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. మధ్యంతర శ్రేణికి చెందిన ఈ క్షిపణిని తాము పరీక్షించామని ఇరాన్ అధికారులు శనివారం ప్రకటించారు. ఖోరామ్ షాV్ా క్షిపణిని ప్రయోగిస్తున్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ టీవీ శనివారం ప్రసారం చేసింది.అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ ప్రయోగించారో వివరాలు వెల్లడించలేదు.
ఈ క్షిపణి సుమారు 2 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఈ క్షిపణిని శుక్రవారం ఇరాన్లో జరిగిన సైనిక పరేడ్లో ప్రదర్శించారు. ఒకటి కంటే ఎక్కువ వార్హెడ్స్ను ఈ క్షిపణి ఏకకాలంలో మోసుకెళ్లగలదు. దీంతో ఇజ్రాయెల్, సౌదీఅరేబియాలతో పాటు చైనా, రష్యా, యూరోప్, ఆఫ్రికా భారత్ల్లోని పలు ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి.
ఇటీవల ఐక్యరాజ్యసమితిలో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ అణ్వాయుధీకరణను వ్యతిరేకించారు. 2015లో ఒబామా ప్రభుత్వం.. ఇరాన్తో కుదుర్చుకున్న పౌర అణు ఒప్పందాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. అయితే ఐరాస వేదికగా ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ కూడా మాట్లాడారు. ఆత్మరక్షణ కోసం తమ మిలిటరీ సత్తాను పెంచుకోనున్నట్టు ఆయన చెప్పారు. ఇరాన్ అధ్యక్షుడు ఐరాసలో ప్రకటన చేసిన రెండు రోజుల్లోనే ఖోరమ్షాహర్ మిస్సైల్ పరీక్ష జరగడం విశేషం. ఈ మిస్సైల్కు అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది.
ముందే హింట్ ఇచ్చిన రౌహానీ
ఇరాన్ క్షిపణి పరీక్షలపై అధ్యక్షుడు రౌహానీ ముందే హింట్ ఇచ్చారు. శుక్రవారం జరిగిన సైనిక కవాతులో ఆయన మాట్లాడుతూ ఇరాన్ తన క్షిపణి, సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటుందని చెప్పారు. అవసరమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటుందని అన్నారు. ఆయన ఈ ప్రకటన చేసిన మర్నాడే క్షిపణిని పరీక్షించినట్టు ఇరాన్ వెల్లడించింది.
గత వారమే ఇరాన్పై ఆంక్షల సడలింపును అమెరికా మరికొన్నాళ్లు పొడిగించింది. అప్పట్లో దీనిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2015లో జరిగిన ఒప్పందం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క ఫ్రాన్స్ కూడా ఇటీవల ఇరాన్ తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. గురువారం ఆ దేశ అధ్యక్షుడు మాక్రోన్ మాట్లాడుతూ ఇరాన్ కూడా మరో ఉత్తరకొరియా వలే తయారవుతుందన్నారు.