Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'రోహింగ్యా'లను అడ్డుకోవటం సరైంది కాదు: పోప్ ఫ్రాన్సిస్
రోమ్ : శరణార్థుల సంక్షోభం ఎలా పరిష్కరించాలన్న విషయంపై ప్రపంచ దేశాలు దృష్టిసారించాలని వాటికన్ పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. మయన్మార్లో రోహింగ్యాలపై హింసాకాండ కారణంగా తలెత్తిన శరణార్థుల సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడారు. రోమ్లో జరుగుతున్న 'ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్' సమావేశంలో ఆయన మాట్లాడుతూ. .''అంతర్జాతీయ అభివృద్ధి కార్యక్రమంలో జాలి అన్నదానికి కాకుండా, ప్రేమ అన్న అంశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అంతర్జాతీయంగా దేశాల మధ్య సహకారం అన్నదాంట్లో 'ప్రేమ'ను పొందుపర్చాలి. కేవలం జాలి చూపించడంతోనే సరిపెడుతున్నాం. అత్యవసరంగా సాయం అందాల్సిన చోట 'ప్రేమ' తప్పక అవసరం. అది సరైన న్యాయాన్ని కూడా ఇస్తుంది'' అని అన్నారు. పారిస్ కేంద్రంగా ప్రపంచ పర్యావరణ ఒప్పందమే ఇందుకు ఉదాహరణ అని గుర్తుచేశారు. శరణార్థుల సంక్షోభానికి గల కారణాలపై వివిధ దేశాలు దృష్టిపెట్టాలని అన్నారు. ప్రాణ భయంతో సర్వం కోల్పోయి వస్తున్న (రోహింగ్యాలు) వారిని ఎలా అడ్డుకుంటారని ప్రశ్నించారు. చట్టపరమైన, జాతిపరమైన కోణంలో వారిని చూసి అడ్డుకోవద్దని, కేవలం మానవత్వంతో చూడాలని ఆయన చెప్పారు.