Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి 'కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా' 19వ జాతీయ కాంగ్రెస్ సమావేశాలు
- రెండో పర్యాయం దేశాధ్యక్షుడిగా జిన్పింగ్ ఖాయం
బీజింగ్ : 2012లో అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించిన సందర్భంగా దేశ భవిష్యత్తుపై పార్టీ ముందు జిన్పింగ్ ఉంచిన ప్రణాళిక 'చైనా డ్రీమ్'. ఆనాడు ఆయన ఏమన్నారంటే...''చైనాలో సోషలిజం స్థాపించడానికి చేసే ప్రయత్నాలు నిరంతరం కొనసాగాలి. ఈ మార్గంలో వెళ్లడానికి మనోబలాన్ని చూపాలి. దేశం కోసం పోరాడటమే 'చైనా స్ఫూర్తి'. దీనికి సంస్కరణలు, సృజనాత్మకత కీలకమైనవి'' అని అన్నారు. ఈ ఐదేండ్ల కాలంలో పొందిన ఫలితాలు ఆయనలో మరింత ఆత్మవిశ్వాసం నింపాయి. ఇందుకు 'వన్ బెల్ట్ వన్ రోడ్' ప్రాజెక్ట్ దీనికి ఉదాహరణ. శక్తివంతమైన, ఉన్నతమైన సమాజంతో కూడిన చైనా ఏర్పడుతుందన్న బలమైన నమ్మకం అక్కడి ప్రజల్లో ఏర్పడింది. 'చైనా డ్రీమ్' ఎలా సాకరమవుతుందన్నది కూడా జిన్పింగ్ ఆనాడు క్లుప్తంగా కొన్ని మాటల్లో చెప్పారు.
ఉదాహరణకు ఒక విద్యార్థి బాగా చదువుకొని, గొప్ప ప్రొఫెసర్ అయ్యి...అతను విద్యారంగం అభివృద్ది కోసం పనిచేయాలి. దేశంలో ప్రతీ ఒక వ్యక్తి తన స్థాయిలో దేశం కోసం ఏది చేయవచ్చో అది చేయటమే 'చైనా డ్రీమ్'. అలాగే అధ్యక్షుడిగా జిన్పింగ్ కూడా తన 'చైనా డ్రీమ్' ప్రకటించారు. తొలి ఐదేండ్ల పాలనా కాలం ముగిసేనాటికి ... ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా చైనాను నిలబెట్టాలి, సైన్యాన్ని బలోపేతం చేయటం..అనేవి ప్రధానమైనవని ఆయన వెల్లడించారు. 2020 నాటికి కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా ఆవర్భవించి 100 ఏండ్లు, 2049 నాటికి పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడి వందేండ్లు అవుతుంది. కాబట్టి 2020 నాటికల్లా చైనా సమాజం సరైన అభివృద్ధిని అందుకోవాలి. 2049 నాటికి చైనా పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించాలి...అన్నవి 'చైనా డ్రీమ్'లోని సామాజిక, ఆర్థిక లక్ష్యాలు. ఈ కలల్ని సాకారం చేసుకునే క్రమంలో జిన్పింగ్ నేతృత్వంలో పార్టీ సాధించిన ఫలితాల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయాణంలో 'చైనా డ్రీమ్' మరో దశకు చేరుకోబోతున్నది.
చైనా పరిస్థితులకు తగ్గట్టుగా...
మార్స్సిజం, లెనినిజాన్ని చైనా పరిస్థితులకు తగ్గట్టుగా అన్వయించి చైనా విప్లవాన్ని సాధించిన మహనీయుడు మావో సె టూంగ్. సాధించిన విప్లవంతో సము న్నతమైన లక్ష్యాల్ని ఏర్పరుచుకొని చైనీయులు సాధించిన అభివృద్ధి నేడు ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్నది. చైనాలో నేటి అభివృద్ధి వెనుక డెంగ్ జియావోపింగ్ ఆలోచనలు, ఆచరణ, సైద్ధాంతిక కృషి దాగివుంది. ఆయన తెరమీదకు తీసుకొచ్చిన రాజకీయ, ఆర్థిక సిద్ధాంతంతోనే చైనా అభివృద్ధి వేగం పుంజుకుంది. మావో, డెంగ్ జియావోపింగ్లు రూపొందించిన రాజకీయ, ఆర్థిక విధానాలు, సైద్ధాంతిక భావజాలం చాలా కీలకమైనది. అందుకే వారిద్దరిని 'చైనా కీలక నాయకులు'గా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా పేర్కొంటున్నది. అంతటి సమున్నతమైన నేతల సరసన జిన్పింగ్ కూడా స్థానం కల్పించారు. ఆయన్ని పార్టీ 'కీలక నేత'గా ప్రకటించారు.
అ అధ్యక్షుడు జీ జిన్పింగ్ తిరిగి ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైంది. తదుపరి ఐదేండ్లకు దేశ నాయకత్వాన్ని ఎన్నుకోవడం ఈ భేటీలో ప్రధాన ఎజెండా. ఈ మేరకు జిన్పింగ్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేసిన కమ్యూనిస్టు పార్టీ.. తిరిగి ఆయన్నే కొనసాగించేందుకు మొగ్గుచూపుతోంది.
అ 19వ జాతీయ కాంగ్రెస్ సమావేశాల సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి, దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్, పార్టీ ప్రతినిధుల ముందు రాజకీయ విధానాన్ని ప్రతిపాదిస్తారు. దీంట్లో పొందుపర్చిన అంశాల ఆధారంగా రాబోయే ఐదేండ్ల కాలంపాటు పార్టీ దశ..దిశ ఉంటుంది. దీనినే పార్టీ సభ్యులంతా తూచా తప్పకుండా పాటించాలి.
అ 'పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ'లోకి కొత్త సభ్యులకు స్థానం కల్పించబోతున్నారని తెలిసింది. అలాగే జిన్పింగ్ అనంతరం పార్టీ పగ్గాలు అందుకునే సామర్థ్యం ఉన్నవారికి ఇందులో చోటుకల్పిస్తారని పాశ్చాత్య మీడియా ఊహాగానాలు చేసింది.
అత్యున్నత నాయకత్వంలోకి కొత్త సభ్యులు !
ప్రతీ ఐదేండ్లకోమారు చైనాలో పాలక కమ్యూనిస్టు పార్టీ జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. 19వ జాతీయ కాంగ్రెస్ సమావేశాలు బుధవారం నుండి బీజింగ్లోని 'గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్'లో ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈసారి సమావేశాల ప్రత్యేకత, దేశ పాలనను నిర్ణయించే పార్టీ అత్యున్నత నాయకత్వంలోకి కొత్త సభ్యులు రాబోతున్నట్టు వార్తలు వెలువడటం ! 68 ఏండ్లు నిండిన నేతలను 'పొలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ' నుంచి పక్కకు తప్పించి, కొత్త వాళ్లను ఎంపికచేస్తారని తెలిసింది. ఈ సమావేశాల లక్ష్యం...పార్టీ అత్యున్నత నాయకత్వాన్ని ఎన్నుకోవటం. రాబోయే ఐదేండ్ల కాలంలో అనుసరించాల్సిన రాజకీయ సిద్ధాంతాన్ని ప్రకటించటం. ఈ సమావేశాలకు చైనా నలుమూలల నుంచి ఎంపికైన 2287 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరంతా కలిసి అత్యంత శక్తివంతమైన పార్టీ సెంట్రల్ కమిటీని ఎన్నుకుంటారు. పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు 'పొలిట్బ్యూరో'ను ఎన్నుకుంటుంది. ఇందులోని సభ్యులు 'పోలిట్బ్యూరో స్టాండింగ్ కమిటీ'ని ఎంపికచేస్తారు. ఈ కమిటీలోని సభ్యులే పార్టీ, ప్రభుత్వ ఉన్నతస్థాయి నిర్ణయాల్ని తీసుకుంటారు. ప్రస్తుతం పొలిట్బ్యూరోలో 24 మంది సభ్యులున్నారు. పార్టీ నిర్ణయాలన్నింటికీ బాధ్యత వహించే 'స్టాండింగ్ కమిటీ' ఏడుగురు సభ్యులతో కూడుకొని ఉంది. చైనా అధ్యక్షుడు, ప్రధాని కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యులు (ఇందులో సుమారుగా 200 మంది ఉంటారు) ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. ఆయనే దేశానికి అధ్యక్షుడుగా నియమితుడవుతారు.