Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పనామా పేపర్స్ కుంభకోణం బయటపెట్టినందుకే..
- 'వన్ వుమెన్-వికీలీక్స్'గా సేవల్ని గుర్తుచేసుకున్న మాల్టా దేశ ప్రజలు
మాల్టా : మాల్టా దేశంలో 'పనామా కుంభకోణం' బయటపెట్టిన జర్నలిస్టు డాఫ్నే కారువానా గాలిజియా(53)ను అతి కిరాతకంగా హత్యచేశారు. సోమవారంనాడు ఆమె ప్రయాణిస్తున్న కారులో బాంబుపెట్టి పేల్చేశారు. ఇంట్లో నుంచి కారు వేసుకొని బయటకు వెళుతున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవిం చడంతో, ఆమె అక్కడికక్కడే మరణించారు. మాల్టా పాలక పార్టీల పెద్దలే ఈ హత్య చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జర్నలిస్టు హత్యను ఖండిస్తూ, మంగళవారంనాడు వేలాదిమంది ప్రజలు రాజధాని వాల్లెట్టాలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. 'వన్ వుమెన్-వికీలీక్స్'గా ఆమె సేవల్ని ప్రజలు కొనియాడారు. మాల్టా దీవిలో చోటుచేసుకునే నేరాల వెనుక వాస్తవాల్ని తన బ్లాగు రచనల్లో గాలిజియా రాశారని వారు గుర్తుచేసుకున్నారు.
'మాల్టా ఇండిపెండెంట్' అనే వార్తా పత్రికకు కాలమిస్టుగా గాలిజియా పనిచేస్తున్నారు. 'రన్నింగ్ కామెంటరీ' అనే బ్లాగ్ను నిర్వహిస్తున్నారు. తన పరిశోధనాత్మక జర్నలిజం కథనాల్ని ఇందులో పోస్ట్ చేసేవారు. ఆమె చనిపోయే అర్ధగంటకు ముందు కూడా ఈ బ్లాగ్లో మాల్టా ప్రధాని చీఫ్ ఆఫ్ స్టాఫ్కు సంబంధించి ఒక కథనాన్ని పోస్ట్ చేశారు. ముఖ్యంగా ఉన్నతస్థాయి రాజకీయ నాయకులు పాల్పడే అవినీతి, నేరాలకు సంబంధించి ఆమె బలమైన కథనాల్ని పోస్ట్ చేసేవారు.
మాల్టా ప్రధాని జోసెఫ్ ముస్కాట్ భార్య, విద్యుత్శాఖ మంత్రి అక్రమంగా నిధులు పొందారన్న విషయాన్ని గాలిజియా బయటపెట్టారు. మాల్టా రక్షణ శాఖలో అవినీతి అధికారులు, డీలర్స్ మధ్య జరిగిన అక్రమాలను వెలికితీసిన జర్నలిస్టుగా ఆమె గుర్తింపు పొందారు. వీటన్నింటిపై ప్రతీకారంగా మాల్టాలోని ప్రభుత్వ పెద్దలే ఆమెను బలితీసుకున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గాలిజియా కుమారుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'మాఫియా స్టేట్' చేసిన దుశ్చర్యగా ఆయన కంటతడిపెట్టారు.