Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివాదాస్పద యోగా గురువు బిక్రం చౌదరీ కోర్టులో పిటిషన్
- అమెరికాలో అతడిపై లెక్కలేనన్ని లైంగిక ఆరోపణల కేసులు
- బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా తప్పించుకునే ఎత్తుగడలు!
చికాగో : తనపై వెళ్లువులా వచ్చిపడుతున్న లైంగిక ఆరోపణల కేసుల నుంచి తప్పించుకోవడానికి అమెరికాలోని వివాదాస్పద యోగా గురువు బిక్రం చౌదరీ కొత్త నాటకం మొదలెట్టారు. 'దివాలా తీసానంటూ' సెంట్రల్ డిస్ట్రిక్ ఆఫ్ కాలిఫోర్నియా కోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. కాలిఫోర్నియా కేంద్రంగా ఆయన నేతృత్వంలో నడుస్తున్న 'ద సిమీ వ్యాలీ' సంస్థకు దాదాపు 50 మిలియన్ డాలర్ల (సుమారుగా రూ.326 కోట్లు) అప్పులున్నాయని పిటీషన్లో తెలియజేశారు. తాను దివాళా తీసానంటూ 'చాప్టర్ 11' ప్రకారం కోర్టులో పిటీషన్ దాఖలు చేయటం, కేవలం లైంగిక ఆరోపణల కేసుల నుంచి తప్పించుకోవడానికి, బాధితులకు నష్టపరిహారం ఎగవేయటం కోసం...బిక్రం చౌదరి చేస్తున్న ప్రయత్నమని వార్తలు వెలువడుతున్నాయి.
వివిధ భంగిమల్లో ఆయన నిర్వహించే యోగా క్లాసుల వల్ల లైంగిక దాడులకు గురయ్యామని అమెరికాలో ఎంతోమంది బిక్రంచౌదరీపై కోర్టుకెక్కారు. కోర్టుకెక్కినవారిలో విద్యార్థులు, యోగా సాధకులు, టీచర్లు... మొదలైనవారు ఎంతోమంది ఉన్నారు. ఈ ఏడాది మేలో అతడిపై అరెస్టు వారెంట్ జారీచేసింది. ఇంతలో అమెరికాలోని తన ఆస్తులన్నింటినీ భార్య, ఇతర సన్నిహితుల పేరు మీదకు తరలించేశాడు. అమెరికా నుంచి పారిపోయి, మెక్సికోలో తలదాచుకున్నాడు.
మొత్తం ఆరుగురు మహిళలు వేసిన కేసుల్లో కోర్టులు పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలంటూ బిక్రం చౌదరీకి వ్యతిరేకంగా తీర్పులు వెలువరించింది. ఇందులో చౌదరీ యోగా స్కూల్లో న్యాయ, అంతర్జాతీయ సంబంధాల నిపుణురాలిగా పనిచేసిన జాఫా బోడెన్ కూడా ఉన్నారు. ఆమెకు ఆమె 8 మిలియన్ డాలర్ల(సుమారుగా రూ.52 కోట్లు) నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. లైంగిక దాడుల బాగోతం బయటకు రాకుండా చేయటం కోసం, కోర్టుల్లో వ్యతిరేకంగా తీర్పులు రాకుండా చూడాలని తనపై ఎంతగానో ఒత్తిడి తెచ్చాడని మరో పిటీషన్ కూడా బోడెన్ కోర్టులో వేశారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్హౌస్లో న్యాయవాదిగా పనిచేసిన పెట్రా స్ట్రాకా కూడా బిక్రం చౌదరీ బాధితురాలే. 5.1 బిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరుతూ కోర్టు కెక్కారు. అతడివల్లే తాను గర్భం దాల్చానని షారాన్ క్లెర్కిన్ అనేమహిళ 3.6 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరుతూ కోర్టుకెక్కారు. ఇలా...అనేక లైంగిక ఆరోపణల కేసులు తన మెడకు చుట్టుకునేసరికి, బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా తప్పించుకోవటం కోసం బిక్రం చౌదరీ 'చాప్టర్ 11' ప్రకారం కోర్టులో పిటీషన్ దాఖలు చేశాడని తెలుస్తున్నది.