Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- థెరిసా మే వైదొలగాలని ఎంపీల డిమాండ్
లండన్ : బ్రిటన్ ప్రధాని థెరిసా మే వైదొలగాలని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఒత్తిడి పెంచారు. ప్రధాని పదవికి ఆమె న్యాయం చేయలేకపోతున్నారని, ఆమె పాలనతో అస్థిరత్వంతో పాటు ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని ఆరోపించారు. థెరిసా మే పాలనను వ్యతిరేకిస్తూ ఓ పిటిషన్ను రూపొందించారు. ఈ పిటిషన్కు మద్దతుగా 40మంది అధికార పార్టీ ఎంపీలు సంతకాలు చేశారు. థెరిసా మే రాజీనామా చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. కాగా, గతేడాది జూన్లో యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలిగిన ( బ్రెగ్జిట్ ) సంగతి తెలిసిందే. బ్రెగ్జిట్ అంశంపై ప్రవేశపెట్టిన రిఫరెండమ్లో ఈయూ నుంచి విడిపోవాలని ఆకాంక్షిస్తున్నట్టు 52శాతం మంది ప్రజలు ఓటు నమోదు చేశారు. ప్రజాతీర్పును గౌరవించి ప్రధాని డేవిడ్ కామెరూన్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పట్లో బ్రిటన్ రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న థెరిసా బ్రిటన్ ప్రధాని పగ్గాలు అందుకున్నారు.
బ్రెగ్జిట్ ప్రక్రియను శరవేగంగా పూర్తయ్యేలా చూస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని హామీ ఇచ్చారు. అయితే, బ్రెగ్జిట్ అనంతరం బ్రిటన్లో పరిస్థితులన్నీ భిన్నంగా మారాయి. బ్రిటన్ ప్రధాని తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె క్యాబినెట్లోని మంత్రులు అవినీతి అక్రమాలకు పాల్పడి ఉద్వాసనకు గురవుతున్నారు. లైంగిక ఆరోపణలపై ఇటీవల బ్రిటన్ రక్షణ మంత్రి మైఖెల్ ఫాలన్ను ఇటీవల పదవి నుంచి తొలగించారు. ప్రధానికి సమాచారం తెలియజేయకుండా ఇజ్రాయిల్ మంత్రులు, అధికారులతో రహస్య మంతనాలు జరిపినట్టు మరో మంత్రి ప్రీతీ పటేల్పై ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఆమె కూడా గతవారమే తన పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. థెరిసా మే నేతృత్వం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీలోనూ అసంతృప్తి ఛాయలు అలుముకున్నాయి. థెరిసా మే బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయూతో సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. బ్రెగ్జిట్ ప్రక్రియను 2019, మార్చి29వరకు పూర్తి చేయనున్నట్టు ఆమె గతంలో ప్రకటించారు. కన్జర్వేటివ్ పార్టీ బలహీనత బ్రిటన్ లేబర్పార్టీకి కలిసివచ్చే అంశంగా మారింది. జెరేమీ కార్బిన్ నేతృత్వంలోని లేబర్ పార్టీ బ్రిటన్లో క్రమక్రమంగా పుంజుకుంటున్నది.